జ‌గ‌న్ బాబాయ్ మ‌ళ్లీ ఆక్టివ్?

మాజీ ముఖ్యమంత్రి దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత సొంత పార్టీ పెట్టిన జ‌గ‌న్‌కు మొదటి నుంచి ఆయ‌న బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అండ‌గా నిలిచారు. అన్ని విధాలుగా జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. 2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఒంగోలు నుంచి ఆయ‌న విజ‌యం సాధించారు. కానీ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన 2019 ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్న ఆయ‌న‌.. పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి ఎంతో కృషి చేశారు. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషిస్తార‌నే ఊహాగానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ సామాజిక స‌మీక‌ర‌ణాలు భవిష్య‌త్ రాజ‌కీయాలు ఇలా అన్ని విష‌యాల‌ను బేరీజు వేసుకున్న జ‌గ‌న్‌.. త‌న బాబాయ్ని ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఛైర్మ‌న్‌గా ఆయ‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

రెండేళ్ల ప‌ద‌వీ కాలం పూర్త‌యిన త‌ర్వాత అయినా ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌ద్దామ‌ని ఆశించిన‌ట్లు స‌మాచారం. రాజ్య‌స‌భ స‌భ్యుడిగానా లేదా ఎమ్మెల్సీ అయి మంత్రి వ‌ర్గంలోనైనా చోటు ద‌క్కుతుంద‌ని ఆయ‌న అనుకున్నార‌ని తెలిసింది. కానీ రెండో సారి కూడా జ‌గ‌న్ త‌న బాబాయ్‌ను టీటీడీకే ప‌రిమితం చేశారు. తొలి విడ‌త‌లో స్వామి వారిపై భ‌క్తితో సుబ్బారెడ్డి త‌న బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించారు. దీంతో రెండోసారి కూడా ఆయ‌న‌ను కొన‌సాగించిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ రెండో సారి టీటీడీ ఛైర్మ‌న్ అయిన త‌ర్వాత సుబ్బారెడ్డి త‌న రూట్ మార్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇలాగే ఉంటే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉనికి నిల‌బెట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన ఆయ‌న తిరిగి త‌న పాత బాట‌లో సాగేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. నామినేటెడ్ ప‌ద‌విలో ఉంటే ప‌ట్టు కోల్పోతాన‌నే ఉద్దేశంతో ప్రత్య‌క్ష రాజ‌కీయాల‌పై ఆయ‌న దృష్టి పెట్టారు. ఉభ‌య గోదావరి జిల్లాల వైసీపీ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న ఆయ‌న గ‌తంలో ఆ వైపు ఎక్కువ‌గా వెళ్ల‌లేదు. కానీ ఇప్పుడు రెండోసారి టీటీడీ ఛైర్మ‌న్ అయిన త‌ర్వ‌తా గోదావరి జిల్లాల‌పై ఫోక‌స్ పెట్టార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏ చిన్న కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన ఆయ‌న పాల్గొంటున్నారు. క‌రోనాతో చ‌నిపోయిన నేత‌ల ఇళ్ల‌కు స్వ‌యంగా వెళ్లి ప‌రామ‌ర్శించారు. కొత్త కొర్పొరేష‌న్ ఛైర్మ‌న్ల ప్ర‌మాణ స్వీకారంలోనూ పాల్గొన్నారు.

ఇప్పుడు సుబ్బారెడ్డి గోదావ‌రి జిల్లాల్లో పార్టీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య త‌లెత్తిన విభేధాల‌ను రాజ‌మండ్రి ఉండి నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో వైసీపీలో నెల‌కొన్న వ‌ర్గ విభేధాల‌ను ప‌రిష్క‌రిస్తూ అంద‌రినీ ఒక్క‌తాటిపైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాకినాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ ప‌ద‌వి వైసీపీ కార్పొరేట‌ర్‌కు ద‌క్కేలా చూస్తున్నార‌ని స‌మాచారం. రాబోయే రాజ‌మండ్రి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మేయ‌ర పీఠాన్ని ద‌క్కించుకోవ‌డం కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నార‌ని తెలిసింది. రాజ‌మండ్రిలోని వైసీపీ నేత‌ల‌తో త‌ర‌చూ స‌మావేశాలు నిర్వ‌హించి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి కొంత విరామం త‌ర్వాత సుబ్బారెడ్డి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించార‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.