సైదాబాద్ ఆరేళ్ల బాలిక పై అత్యాచారం, హత్య

హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో  ఆరేళ్ల బాలిక పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. అనంతరం దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాగా..  ఈ ఘటనలో పోలీసులు నిందితుడు రాజుని అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లా లో అతడిని అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సింగరేణి కాలనీలో.. ఆరేళ్ల బాలిక అదృశ్యమైంది. బాలిక కోసం గాలించగా.. పక్కింట్లో ఉండే రాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక అనుమానాస్పద స్థితిలో శవమై కనపించింది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక రాజు అనే వ్యక్తి ఇంట్లో అర్థరాత్రి శవమై కనిపించింది. పాపపై రాజు లైంగిక దాడి చేసి, ఆ తర్వాత ఆమెను చంపేసి, శవాన్ని బొంతలో చుట్టి ఉంచినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో.. పరారీలో ఉన్న నిందితుడిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

కాగా..ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు,  స్థానికులు  నిన్న నిరసన తెలిపారు.  చంపాపేట్ నుంచి సాగర్ వెళ్లే రోడ్డు లో దాదాపు ఏడు గంటల పాటు బైఠాయించారు.  కలెక్టర్ హామీతో ఆందోళన విరమించారు. ఆందోళనకారుల వద్దకు జిల్లా కలెక్టర్ శర్మన్,  డిసిపి రమేష్ రెడ్డి  వచ్చి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని..  డబుల్ బెడ్ రూమ్ ఇల్లు,  పొరుగు సేవల విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

తక్షణ సహాయం కింద రూ. 50,000 అందజేశారు.  బాధిత కుటుంబంలోని మరో ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని తెలిపారు.  చిన్నారి మృతదేహానికి ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అత్యాచారం చేసి గొంతునులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.  అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బాలికను చంపిన తర్వాత రాజు పరారవ్వగా… అతనిని పోలీసులు గాలించి మరీ పట్టుకున్నారు. ఈ సంఘటనపై స్థానికులు తీవ్రమైన ఆగ్రహానికి గురై ఆందోళనకు దిగారు. రాజును తమకు అప్పగించాలని పోలీసులపై దాడి  కూడా చేశారు. స్థానికులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడిచేశారు దాంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. 300 మంది పోలీసులతో కాలనీలో బందోబస్తు ఏర్పాటు చేశారు.