లోకేశ్ ప్రెస్ మీట్ లో ఈ పాయింట్ హైలెట్ అంట

Lokesh

మాటల్లో తడబాటు.. స్పష్టమైన ఉచ్ఛారణ లేకపోవటం.. పలికే మాటల్లో అన్వయ దోషాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. మాజీ మంత్రి లోకేశ్ మాట్లాడుతుంటే.. రాజకీయ ప్రత్యర్థులు పండుగ చేసుకునే వారు. ఆయన ప్రెస్ మీట్ అయినంతనే.. ఆయన మాట్లాడిన మాటల్ని అసరాగా చేసుకొని మీమ్స్ మొదలు.. చిన్నిచిన్ని వీడియోల్ని చేసేవారు. అయితే.. అదంతా ఒకప్పుడు. చేతిలోని అధికారం చేజారిన తర్వాత.. లోకేశ్ రూపంలోనే కాదు.. మాటల్లోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతానికి భిన్నంగా ఆయన విషయాల మీద ప్రిపేర్ అవుతున్నారు. మీడియా సమావేశాల్లో ఆయన మాట తీరులో తేడా కనిపిస్తోంది. తాజాగా హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు నరసరావుపేటకు వెళుతుంటే.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవటం తెలిసిందే.

ఈ సందర్భంగా జరిగిన ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే.. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేశ్.. కీలకాంశాల్ని ప్రస్తావించారు. అన్నింటికి మించి.. ఆయన ఒక పాయింట్ చాలామందిని ఆకట్టుకుంటుందన్న భావనను వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకూ ఆయన చెప్పిన ఆ కీలక పాయింట్ ఆయన మాటల్లో చూస్తే.. “దిశ చట్టం ఫేక్ చట్టం. దాన్ని తీసుకురాకుంటే.. నిర్భయ చట్టం కింద వీళ్లందరి పైన కేసు పెట్టి ఉంటే.. ఎవరైతే మహిళల మీద దాడి చేశారో.. వాళ్లందరూ జైల్లో ఉండే పరిస్థితి. బెయిల్ కూడా వచ్చి ఉండేది కాదు. కానీ.. ఈ రోజు బెయిల్ వచ్చిందంటే.. దానికి కారణం ఈ చేతకాని జగన్ రెడ్డి వల్లే. ముఖ్యమంత్రి.. డీజీపీని అడుగుతున్నా.. మీరిప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు అన్నారే? చేతులు ఊపుతూ అన్నారే? 21 పని దినాల్లో శిక్ష పడుతుంది అని.. ఎస్.. దిస్ ఈజ్ ద జగన్ అని పెద్ద పెద్ద మాటలు అన్నారే? 150 మంది తోడు దొంగలు ఉన్నారే.. వారంతా చప్పట్లు కొట్టారు. శాసన మండలిలో కూడా పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఏమైందని అడుగుతున్నా? బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది” అని మండిపడ్డారు.

మీడియా సమావేశంలో ఆయన మాటల్లో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యల్ని చూస్తే..

  • దిశ చట్టం ఉందని జగన్ సొంత పేపర్.. చానల్ కు రూ.30 కోట్లు యాడ్స్ ఇచ్చారు. కోట్లాది రూపాయిలు ఇచ్చేస్తారా? ఆయన పార్టీకి చెందిన ఎంపీ ఒకరు పార్లమెంటులో దిశ చట్టం మీద స్టేటస్ ఏమిటని ప్రశ్నించారు. అందుకు బదులుగా కేంద్రం సమాధానం ఇస్తూ.. ‘‘మేం కొన్ని ప్రశ్నలు అడిగాం.. ఆంధ్రరాష్ట్రం నుంచి సమాధానాలు రాలేదు’ అని చెప్పారు. మరి.. దీనికేమంటారు?
  • నేను దొంగను కాదు. ఉగ్రవాదిని కాదు. ముఖ్యమంత్రి జగన్ లా ఫ్యాక్షనిస్టును కూడా కాదు. ముఖ్యమంత్రిని చొక్కా పట్టుకోండి. నడిరోడ్డుపై కాల్చి చంపండని ప్రజల్ని రెచ్చగొట్టలేదు.
  • కాన్వాయ్ లో వచ్చానని.. కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించానని.. జాతీయ రహదారిని దిగ్బంధించానని అభియోగాలు మోపి నోటీసు ఇవ్వటం సిగ్గుచేటు. కాన్వాయి పెట్టిందీ.. కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించిందీ.. హైవేలో ట్రాఫిక్ అడ్డంకులు కల్పించిందీ పోలీసులే.
  • యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతుంటే ప్రభుత్వానికి అంత ఉలుకెందుకు? యువతి కుటుంబం పరామర్శకు వెళ్లేందుకు నాకు స్వేచ్ఛ ఉంది. ఎవరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కచ్ఛితంగా నరసరావుపేటకు వెళతా. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిస్తే. ఆ ఒక్క కుటుంబాన్నే కాదు.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో 517 మంది మహిళలపై దాడులు.. హత్యలు.. అత్యాచారాలు జరిగాయి. ఆ కుటుంబాలన్నింటి తరఫునా పోరాడతా.
  • రమ్య హత్య జరిగి గురువారంతో 21 రోజులు అవుతుంది. దిశ చట్టం తెచ్చినప్పుడు.. జగన్ చెప్పినట్లు రమ్య హంతకుడికి 21 రోజుల్లో శిక్ష పడలేదు సరికదా.. ఆ వ్యవధిలోనే రాష్ట్రంలో మరో 17 మంది మహిళలపై దాడులు జరిగాయి. నరసరావుపేటలో అత్యాచారానికి పాల్పడి.. కిరాతకంగా బాధితురాలిని చంపేస్తే దోషులకు 40 రోజుల్లో శిక్షిస్తామన్నారు. ఆర్నెల్లు అయినా న్యాయం జరగలేదు. యువతి పేరు తెలీకుండా ఒక పేరుకు బదులు మరో పేరు చెప్పారు నరసరావుపేట ఎమ్మెల్యే. పైగా వారి కటుుంబానికి ప్రభుత్వం రూ.10లక్షలు ఇచ్చింది కదా? ఇంకేం చేయాలన్నట్లు ఎగతాళిగా మాట్లాడారు.
  • తండ్రి భౌతికకాయం పక్కన సీఎం పదవి కోసం ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన ఘనత జగన్ కే దక్కతుంది. అనూష చనిపోయిన రోజే నేను ఆమె కుటుంబీకుల్ని ఫోన్ లో ఓదార్చా. సెప్టెంబరు 9న ఆమె పుట్టిన రోజుని.. ఆ రోజు ఇంటికి రావాలని వారి కుటుంబీకులు కోరారు. వైఎస్ చనిపోయిన తర్వాత కొన్నేళ్ల పాటు జగన్ ఓదార్పు యాత్ర చేయగా లేనిది.. నేను బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే తప్పేంటి?