ఎన్నారైల‌పై మోడీ వ‌రాల వ‌ర్షం.. ఏం చేశారంటే

విదేశాల్లో ఉన్న ప్ర‌వాస భార‌తీయుల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తీపిక‌బురు అందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు వారు ప‌డుతున్న ఇబ్బందుల‌ను తొల‌గించేందుకు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నారైలు భార‌త్కు వ‌చ్చిన‌ప్పుడు.. వారు ఆధార్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే.. దాదాపు 6 నెల‌లు ప‌ట్టేది. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొనే వారు. అయితే.. ఇప్పుడు మోడీ స‌ర్కారు ఈ విష‌యంలో కొంత స‌డ‌లింపు ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో కేంద్రం ఆదేశాల మేర‌కు ఎన్నారైలకు వెంటనే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్న‌ యూఐడీఏఐ(యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

స్వదేశానికి వచ్చిన వెంటనే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే, దీనికి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం ఇండియన్ పాస్‌పోర్టు తప్పనిసరి అని పేర్కొంది. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ ఓ ట్వీట్ చేసింది. “ఎన్నారైలు ఇకపై ఆధార్ దరఖాస్తు కోసం 182 రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. చెల్లుబాటయ్యే భారతీయ పాస్‌పోర్టు ఉన్న ప్రవాస భారతీయులు స్వదేశానికి రాగానే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. ఇతర వివరాల కోసం 1947 ఫోన్ చేయవచ్చు. లేదా help@uidai.gov.inకు మెయిల్ చేయండి” అంటూ యూఐడీఏఐ ట్వీట్ చేసింది.

ప్రవాస భారతీయులు ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునే విధానం కూడా వివ‌రించింది.. అదేంటంటే.. మొదట సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. చెల్లుబాటు అయ్యే ఇండియన్ పాస్‌పోర్టు తీసుకెళ్లడం తప్పనిసరి. నమోదు దరఖాస్తు ఫారంలో వివరాలు నింపాలి. ఎన్నారైలు ఈ-మెయిల్ ఐడీ ఇవ్వడం తప్పనిసరి. ఇక ప్రవాస భారతీయులకు డిక్లరేషన్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కనుక జాగ్రత్తగా చదివిన తర్వాత సంతకం పెట్టాలి. తనను ఎన్నారైగా నమోదు చేయాల్సిందిగా ఆపరేటర్‌ను ప్రత్యేకంగా అడగాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా మీ పాస్‌పోర్టు ఇవ్వాలి. బయోమెట్రిక్ క్యాప్చర్ ప్రాసెస్‌ను కూడా జాగ్రత్తగా పూర్తి చేయాలి. 14 అంకెలతో ఉండే దరఖాస్తు స్లిప్‌ను తీసుకోవడం మరిచిపోకూడదు. ఈ స్లిప్‌లో దరఖాస్తు ఐడీ, తేదీ, సమయం ఉంటాయి. ఇవి మీ దరఖాస్తు స్టేటస్‌ను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అని పేర్కొంది. మొత్తంగా ఇది ఎన్నారైలు ఎప్ప‌టి నుంచో ఎద‌రు చూస్తున్న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.