ఇండియాలో కరోనా.. ఇంకో 20 రోజులకు ఏం జరగబోతోంది?

ఇండియాలో తొలి కరోనా కేసు నమోదయ్యాక.. లక్ష కేసుల మార్కును అందుకోవడానికి రెండు నెలలకు పైగా సమయం పట్టింది. కానీ గత పది రోజుల వ్యవధిలో కేసులు 60 వేల దాకా ఉండటం గమనార్హం. దీన్ని బట్టి కరోనా వ్యాప్తి మే నెలలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐతే దేశంలో కరోనా వ్యాప్తి విషయంలో ఇది పతాక స్థాయి కాదని అంటున్నారు నిపుణులు.

ముందుంది ముసళ్ల పండగ అని హెచ్చరిస్తున్నారు. జూన్ నెలలో ఇండియాలో కరోనా పీక్స్ చూడబోతున్నామట. వచ్చే 20 రోజుల వ్యవధిలో కరోనా కేసుల ఉద్ధృతి ఊహించని స్థాయిలో ఉంటుందని.. జూన్ 17 నాటికి కేసుల సంఖ్య ఏకంగా 5 లక్షలకు చేరుతుందని ఢిల్లీ ఐఐటీ పరిశోధక బృందం తమ నివేదికలో పేర్కొంది.

ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తున్న మహారాష్ట్రలో 20 రోజుల తర్వాత కరోనా కేసులు లక్ష మార్కును దాటేస్తాయని ఈ నివేదికలో పేర్కొన్నారు. అక్కడ కేసుల సంఖ్య 1.09 లక్షలకు చేరుతుందట.

అసోంలో 86 వేలకు, ఛత్తీస్‌గఢ్‌లో లక్షకు కేసుల సంఖ్య పెరుగుతుందట. అప్పటికి కేరళ, ఛత్తీస్‌గఢ్‌, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రెడ్‌జోన్‌లో ఉంటాయని.. బిహార్‌, జమ్మూ-కశ్మీర్‌, కర్ణాటక, ఝార్ఖండ్‌ ఆరెంజ్‌ జోన్‌లో ఉంటాయని ఈ నివేదికలో పేర్కొన్నారు.

తెలంగాణ, ఏపీ సహా మిగతా రాష్ట్రాలన్నీ గ్రీన్ జోన్లోకి వస్తాయని.. తెలంగాణలో అప్పటికి యాక్టివ్ కేసులు 2400 దాకా.. ఏపీలో కేసులు 800 దాకా ఉంటాయని ఇందులో వెల్లడించారు.

ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 1.6 లక్షల దాకా ఉ:డగా.. అందులో 87% పైగా కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వీటిలో ప్రతి రాష్ట్రంలోనూ 2,500 కంటే ఎక్కువ కేసులున్నాయి. ఇదిలా ఉండగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సంక్రమణ రేటు తగ్గుతోందని.. ఇది మంచి పరిణామమే అని ఈ నివేదికలో పేర్కొన్నారు.