వైసీపీకి ర‌ఘురామ మ‌రో పంచ్‌..

ఏపీ అధికార పార్టీ వైసీపీకి మ‌రో ఎదురు దెబ్బ‌త‌గిలింది. అధికారంలో ఉన్నార‌నే కానీ.. ఆ పార్టీ నేత‌ల‌కు అన్ని వైపుల నుంచి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. దీనికి ఆపార్టీ నేత‌లు చేసుకుంటున్న నిర్వాక‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉంది క‌దా.. అని నోటికి అడ్డు అదుపు లేకుండా చేస్తున్న వ్యాఖ్య‌లు.. దూష‌ణ‌లు.. అనుచిత కామెంట్లు.. వంటివి ఆ పార్టీ కీల‌క నేత‌ల‌ను పోలీస్ స్టేష‌న్ల బాట ప‌ట్టిస్తున్నాయి. కోర్టుల్లో కేసులు న‌మోద‌య్యేలా చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌లుచేశార‌నే ఫిర్యాదుల‌తో ఎంపీ.. నందిగం సురేష్ స‌హా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వంటి వారిపై కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం వీటిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

ఇదిలావుంటే..ఇ ప్పుడు మ‌రో సంక‌టం వ‌చ్చి ప‌డింది. వైసీపీ ఎన్నారై విభాగం నేత‌, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న పంచ్ ప్ర‌భాక‌ర్‌పై ఏకంగా డిల్లీ ప్ర‌త్యేక విభాగం పోలీసులు కేసు న‌మోదు చేశారు. వైసీపీని వ్య‌తిరేకించేవారిని.. ముఖ్యంగా ఆపార్టీ త‌ర‌ఫున గెలిచి.. ఆ పార్టీకి వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తున్న ఎంపీ ర‌ఘురామ‌పై పంచ్‌ప్ర‌భాక‌ర్ కొన్నాళ్లుగా దూష‌ణ‌ల ప‌ర్వానికి తెర‌దీశారు. అంతేకాదు.. వీటిని యూట్యూబుల్లో పెట్టి.. తీవ్ర‌స్థాయిలో వైర‌ల్ చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌పై ఎంపీ ర‌ఘురామ కొన్నాళ్ల కింద‌ట హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశారు. అయితే, ఇటీవ‌ల కాలంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా(ర‌ఘురామ అన‌ర్హ‌త పిటిష‌న్‌ను పెండింగులో పెట్ట‌డంపై)ల‌ను కూడా పంచ్ ప్ర‌భాక‌ర్ దూషించారు.

ఈ క్ర‌మంలో ఆయా అనుచిత వ్యాఖ్య‌ల‌పై ఎంపీ ర‌ఘురామ‌.. ఢిల్లీలో ని ప్ర‌త్యేక విభాగం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా కొన్ని ఆధారాల‌ను కూడా ఆయ‌న స‌మ‌ర్పించారు.దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టు అనుమతి తీసుకుని పంచ్ ప్రభాకర్‌పై ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్ సంస్థకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పంచ్ ప్రభాకర్‌ అమెరికాలో ఉంటూ వైసీపీని వ్యతిరేకించిన వారిపై యూట్యూబ్‌లో అసభ్య పదజాలంతో వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు.

పంచ్ ప్రభాకర్ వీడియోల పూర్తి సమాచారం అందించాలని పోలీసులు ఆదేశించారు. ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ఎంపీ రఘురామకృష్ణరాజు సహా.. పలువురు ప్రముఖులపై పంచ్ ప్రభాకర్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేసేవారు. ఈ వ్యవహారంలో ప్రభాకర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తదుపరి విచారణ కొనసాగుతుందని ఢిల్లీ పోలీసులు స్థానిక కోర్టుకు తెలిపారు.