కాందహార్లో తాలిబన్ల జెండా

యావత్ ప్రపంచం అనుమానిస్తున్నట్లే మొత్తం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయిపోతోంది. తాజాగా దేశంలోనే రెండు అతిపెద్ద నగరాలైన కాందహార్ ను తాలిబన్లు స్వదీనం చేసుకున్నారు. మిలిట్రీ, సివిల్ పోలీసులకు తాలిబన్ల సైన్యంతో గురు, శుక్రవారాల్లో పెద్ద యుద్ధమే జరిగింది. చివరకు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మొత్తం నగరమంతా తీవ్రవాదుల వశంలోకి వెళ్ళిపోయింది. దీనికి ఆధారంగా కాందహార్ లోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై తాలిబన్ల జెండాలు రెపరెపలాడుతున్నాయి.

దేశంలోని 440 జిల్లాల్లో ఇప్పటికే సుమారు 300 జిల్లాలు తాలిబన్ల ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ప్రభుత్వం చేతిలో 70 జిల్లాలుండగా మిగిలిన వాటికోసం రెండు వర్గాల మధ్య తీవ్రస్ధాయిలో యుద్ధం జరుగుతోంది. చాలా జిల్లాల్లో సివిల్ పోలీసులు తీవ్రవాదులకు లొంగిపోతున్నారు. పోలీసులే తీవ్రవాదులకు ఎందుకు లొంగిపోతున్నారంటే మిలిట్రీ నుండి సరైన రక్షణ అందటంలేదు కాబట్టే.

ఇక్కడ గమనించాల్సిందేమంటే పోలీసులకన్నా తాలిబన్లు అత్యంతాధునిక ఆయుధాలను వాడుతున్నారు. దాంతో తమ దగ్గరున్న ఆయుధాలతో పోలీసులు తాలిబన్లను ఎదిరించలేకపోతున్నారు. తీవ్రవాదుల జోరు చూస్తుంటే మరో పదిరోజుల్లోనే దేశ రాజధాని కాబూల్ ను కూడా హస్తగతం చేసుకునేట్లే ఉన్నారు. ఇదే విషయాన్ని తీవ్రవాదులు బాహాటంగా ప్రకటించారు. కాబూల్ కు 60 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలన్నీ ముఖ్యంగా హెల్మాండ్ నగరం కూడా తాలిబన్ల చేతిలోకి వెళ్ళిపోయింది.

ప్రపంచదేశాలకు చెందిన మిలిట్రీ దళాలు ఆఫ్ఘన్ నుండి వెళ్ళిపోతే దేశంమొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోవటం ఖాయమని, అప్పుడు అరాచకాలు మొదలవుతాయని అందరు ఊహించిందే. ఇపుడు అదే విధంగా జరుగుతోంది. తమ ఆధీనంలోకి వచ్చేసిన ప్రాంతాల్లో తాలిబన్లు మహిళలు, అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఒంటరి మహిళలను, అవివాహితులను ఎత్తుకెళ్ళిపోయి వివాహాలు చేసుకుంటున్నారు.

ఇళ్ళల్లోకి జొరబడి ఆడవాళ్ళు, అమ్మాయిల కోసం వెతుకుతుండటంతో దేశమంతా అలజడి మొదలైంది. అలాగే క్లీన్ షేవ్ చేసుకున్నవాళ్ళని కాల్చి చంపేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా రోడ్లపైన కనబడిన జనాలను కాల్చి చంపేస్తున్నారు. చిన్న తప్పులు చేసిన వాళ్ళకి కూడా తాలిబన్ల మరణశిక్షలు వేసేస్తున్నారు. దీంతో మగవాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. అంతేకాకుండా వందలాది కుటుంబాలకు మగదిక్కే లేకుండా పోతోంది. మరిలాంటి అరాచకాలు ఎంతకాలం సాగుతాయో కాలమే సమాధానం చెప్పాలి.