ఏపీ హైకోర్టుకు ఎందుకంత కోపం వచ్చింది?

రాజ్యాంగం భావస్వేచ్ఛ ఇచ్చింది. కానీ.. ఎవరి మీద పడితే వారి మీద మనసుకు తోచింది అనేందుకు కాదు. వ్యవస్థల మీద సహజసిద్ధంగా ఉండాల్సిన గౌరవ మర్యాదలు మిస్ కావటం ఆందోళన కలిగించే అంశం. సగటు రాజకీయ పార్టీల మీద ఏ రీతిలో అయితే రాజకీయ ఎదురుదాడులు ఉంటాయో.. అదే తీరులో న్యాయవ్యవస్థ మీద మండిపడటం.. అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం మంచిది కాదు.

ఈ విషయాన్ని మర్చిపోతున్నప్పుడు.. పెద్ద మనిషి హోదాలో హద్దుల్ని గుర్తు చేయాల్సిన అవసరం అధినేత హోదాలో ఉన్న వారు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడాయనకు కొత్త సమస్యల్నే కాదు.. చిక్కుల్ని తెచ్చి పెట్టనుంది.

దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అధికారపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇదేమాత్రం క్షేమకరం కాదు. ఇలాంటి ఇమేజ్ రానున్న రోజుల్లో తనకు ప్రతికూలంగా మారుతుందన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది.

తాజాగా న్యాయవ్యవస్థపై సోషల్ మీడియాలో జగన్ మీద అభిమానం పేరుతో పెడుతున్న పోస్టులు కలకలం రేపుతున్నాయి. అవి.. జగన్ కు ప్లస్ కాకపోగా.. తీవ్రనష్టాన్ని కలిగిస్తున్నాయి. అభిమానుల సంగతి ఇలా ఉంటే.. బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న పార్టీ నేతలు సైతం ఇదే తీరును అనుసరించటం సరికాదు. తాజాగా హైకోర్టు ఫుల్ బెంచ్ చేసిన ఆగ్రహాన్ని.. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ‘సోషల్ దూకుడు’కు కళ్లాలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

‘‘హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉంటే అంతమందినీ ముక్కలుగా నరకాలి. అందరినీ నరకాల్సిందే. మొత్తం జడ్జీలను ఒక గదిలో పెట్టి.. అదే గదిలో కరోనా రోగిని వదలాలి’’ అంటూ చందూరెడ్డి అనే వ్యక్తి చేసిన ట్వీట్ చిన్న ఉదాహరణ మాత్రమే. ఇప్పటివరకూ ఏ హైకోర్టు న్యాయమూర్తులకు ఇలాంటి వ్యాఖ్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాలేదేమో? కిశోర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టు జడ్జిలపై మరింత నోరు పారేసుకున్నారు. హై కోర్టు జడ్జీలు ఎందుకూ పనికి రారంటూ బూతులు తిట్టి.. కావాలంటే తననూ అరెస్టు చేసి సీబీఐ విచారణకు ఆదేశించవచ్చునని పోస్టు పెట్టిన వైనం హైకోర్టుకు ఆగ్రహం కలిగించింది.

అభిమానులు ఇలా విరుచుకుపడుతుంటే.. పార్టీ ఎంపీలు సైతం తమ పరిమితుల్ని మరిచిపోయి చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాడేపల్లిలోని అధికారపార్టీ ఆఫీసులో బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హైకోర్టు జడ్జీలకు.. హైకోర్టుకు కులం ఆపాదించిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. కోర్టు తీర్పులు చంద్రబాబుకు పది నుంచి ముప్ఫై నిమిషాల ముందే తెలుస్తున్నాయని.. ఈ అంశంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జడ్జీల గౌరవాన్ని.. వారి ప్రతిష్ఠను దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేస్తున్న వీడియోలపైనా హైకోర్టు మండిపడుతోంది.