సోము ఇంటికేనటగా… ?

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మీద బీజేపీ హై కమాండ్ గుర్రుగా ఉందా. ఆయన ఢిల్లీకి ఎన్నిసార్లు తిరిగినా కూడా జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా దర్శనం లభించడంలేదా. సోము ప్రెసిడెంట్ అయ్యాక ఏపీలో బీజేపీ ఇమేజ్ పాతాళానికి పడిపోయిందా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అవును అనే వస్తోంది. సోముని తప్పించాలనే హై కమాండ్ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. అర్జంటుగా అయన ప్లేస్ లో కొత్త వారిని తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారుట. జమిలి ఎన్నికలు అంటూ కేంద్రం కొత్త రాగం పాడుతున్న నేపధ్యంలో ఏపీ లాంటి చోట్ల పొత్తులు ఎత్తులు గట్టిగా వేయాలంటే సోము స్థానంలో వేరొక నేతను తీసుకురావాల్సిందే అంటున్నారు.

ఇదిలా ఉండగా సోము మీద బీజేపీ మండిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయట. వాటిలో ఒకటి సినీ గ్లామర్ తో పాటు చరిష్మా కలిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీకి ఎడంగా ఉండడం. సోము ఓవర్ యాక్షన్ వల్లనే పవన్ బీజేపీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు అంటున్నారు. సోము కంటే ముందు ప్రెసిడెంట్ గా పనిచేసిన కన్నా లక్ష్మీనారయణ టైమ్ లో అయితే పవన్ జనసేన ప్రతీ కార్యక్రమంలో హుషార్ గా పాల్గోనేదని కూడా చెబుతున్నారు.

సోము ఎంత మెగా ఫ్యామిలీని సన్నిహితుడిని అని చెప్పుకుంటున్నా కూడా అటు నుంచి రియాక్షన్ లేదని అంటున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగితే పవన్ కళ్యాణ్ ని గట్టిగా ప్రచారానికి ఒకటికి నాలుగు సార్లు రప్పించలేకపోవడం వెనక సోము ఫెయిల్యూర్ ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీకి కూడా సోము బాగా దూరం పాటిస్తున్నారు. టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలు బీజేపీలో చేరారు. వారు ఇపుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. వారిని కలుపుకుని పోవడంలో కూడా సోము విఫలం అయ్యారని అంటున్నారు.

అదే విధంగా సోము ఒక వర్గాన్ని బీజేపీలో కొనసాగిస్తూ వారితోనే అన్నీ అన్నట్లుగా ఉంటున్నారుట. మరి సొంతంగా పార్టీ ఎదగక, ఎత్తులు వ్యూహాలు లేకపోతే ఎలా అంటూ హై కమాండ్ ఆగ్రహిస్తోందిట. అందుకే సోము ప్లేస్ లో తొందరలోనే కొత్త నాయకుడికి ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగిస్తారు అంటున్నారు. అది మాజీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ అయినా కావచ్చు అన్నదే ఢిల్లీ కబురుగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!