ప్రవీణ్ ది రాంగ్ స్టెప్పేనా ?

ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి దూకుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాంగ్ స్టెప్పు వేస్తున్నారా ? ఇపుడిదే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘసేవలు అందించిన ప్రవీణ్ ఉద్యోగానికి రాజీనామా చేయటం ఆశ్చర్యపరిచింది. ఉద్యోగానికి రాజీనామా చేయటం అప్పుడెంత ఆశ్చర్యపరిచిందో ఆయన తాజా నిర్ణయం అంతకుమించి ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ప్రవీణ్ వచ్చేనెల 8వ తేదీన ప్రవీణ్ బహుజన్ సమాజ్ వాదీపార్టీ(బీఎస్పీ)లో చేరబోతున్నారట. నల్గొండలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సమావేశంలో ప్రవీణ్ బీఎస్పీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లోకి ప్రవేశించి సేవ చేయాలని అనుకునే ఎవరైనా చేసేదేమంటే అధికారపార్టీలో చేరటమే. ఎందుకంటే అధికారపార్టీలో ఉంటేనే జనాలకు ఏవైనా నాలుగు పనులు చేయగలరన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి రాజకీయాల్లో ప్రతిపక్షల సభ్యులను, నేతల్లో చాలామందిని ప్రభుత్వం రాచిరంపాన పెడుతున్న విషయం తెలిసిందే.

ప్రతిపక్షాల తరపున గెలిచిన వాళ్ళు కూడా తర్వాత అధికారపార్టీల్లో చేరిపోతున్న విషయాన్ని అందరు చూస్తున్నదే. ఎన్నికలు దగ్గరలో ఉన్నపుడు ప్రతిపక్షాల్లో చేరే నేతలు కూడా ఉంటారు. కానీ ఇపుడు ప్రవీణ్ మాత్రం బీఎస్పీలో చేరాలని అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే బీఎస్పీ అనే పార్టీ జనాలకు పెద్దగా తెలిసినపార్టీ కాదు. 2014లో ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు ఎంఎల్ఏలు బీఎస్పీ తరపున గెలిచినా అది పూర్తిగా వ్యక్తిగత బలంతో గెలిచిందే.

ఎందుకంటే గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ లో టికెట్లు దక్కకపోతే చివరి నిముషంలో బీఎస్పీ తరపున పోటీచేసి గెలిచారు. ఇపుడు ఆ పార్టీని అనుకునే వాళ్ళు కూడా లేరు. ఇలాంటి నేపధ్యంలో ప్రవీణ్ పోయి పోయి ఆ పార్టీలో చేరటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించటానికే తాను ప్రభుత్వ సర్వీసు నుండి తప్పుకున్నట్లు చెప్పటాన్ని కూడా జనాలు తప్పుపడుతున్నారు.

పదిమందికి సాయం చేయగలిగిన ఐపీఎస్ హోదాను వదిలిపెట్టి ఎవరికీ పట్టని బీఎస్పీ పార్టీలో చేరటం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందని సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. చేరేదేదో అధికారపార్టీలో చేరితే బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయగలిగే అవకాశం ఉండేది కదాని జనాలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఐఏఎస్ కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన జయప్రకాష్ నారాయణ కూడా ఇలాగే చాలా మాటలు చెప్పారు. కానీ చివరకు ఎవరికీ ఏమీ చేయలేక అనామకంగా ఉండిపోయారు. ఇపుడు జయప్రకాష్ నారాయణ కేవలం మీడియాకు మాత్రమే పరిమితమవ్వటాన్ని జనాలు గుర్తు చేసుకుంటున్నారు.