పెద్దిరెడ్డి హ‌వాతో డ‌మ్మీల‌వుతున్న ఫైర్ బ్రాండ్లు..!

రాజకీయాల్లో వారంతా ఫైర్ బ్రాండ్లు. వైసీపీని నిల‌బెట్టేందుకు, ముఖ్యంగా జ‌గ‌న్‌ను సీఎంగా చూడాల‌ని త‌పించారు. 2014లో ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా.. నిత్యం వారి గొంతే వినిపించేది. అప్ప‌టి చంద్ర‌బాబు స‌ర్కారుపై వివిధ రూపాల్లో వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ వినియోగించుకుని విమ‌ర్శ‌లు చేసిన‌వారే. అయితే.. ఇప్పుడు మాత్రం ఇలాంటి వారు.. డ‌మ్మీలుగా మారిపోయార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇంత‌కీ ఎవ‌రు వారు? ఎందుకు డ‌మ్మీలుగా మారిపోయారు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాకు చెందిన కీల‌క‌నేత‌లు.. వైసీపీలో చాలా మంది ఉన్నారు.

ఇలాంటి వారిలో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి, న‌గ‌రి నుంచి కీల‌క నేత‌.. దివంగ‌త గాలి ముద్దుకృష్ణ‌మ‌ను సైతం ఓడించిన జ‌బ‌ర్ద‌స్త్‌ రోజా, ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న నారాయ‌ణ‌స్వామి, మ‌రో ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిలు కీల‌కంగా ఉన్నారు. వీరంతా కూడా జ‌గ‌న్‌ను సీఎంను చేసేందుకు ఎంతో కృషి చేసిన వారే. వీరికి.. దివంగ‌త వైఎస్‌తోనూ అనుబంధం ఉంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. అప్ప‌టి ఎమ్మెల్యే చెవిరెడ్డి, రోజాలైతే.. నిత్యం చంద్ర‌బాబును తిట్టిపోసిన వారే.. రోడ్డెక్కిన‌వారే.. అసెంబ్లీలోనూ దూకుడుగా ఉన్న‌వారే.

మ‌రి ఇంత చేసిన ఈ నాయ‌కుల‌కు.. ఇప్పుడు గుర్తింపు లేకుండా పోయింద‌ని.. క‌నీసం.. జ‌గ‌న్ ను క‌లిసేందుకు కూడా అప్పాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేయాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు చిత్తూరు జిల్లాకు చెందిన రాజ‌కీయ విశ్లేష‌కులు. దీనంత‌టికీ.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి హ‌వానే కార‌ణమ‌ని అంటున్నారు. సీఎం జ‌గ‌న్..పెద్దిరెడ్డికి ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తున్నార‌ని.. ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే జిల్లాను పెట్టార‌ని.. దీంతో డిప్యూటీ సీఎం గా ఉన్న‌ప్ప‌టికీ.. నారాయ‌ణ‌స్వామి సైతం .. ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా.. పెద్దిరెడ్డి అనుమ‌తి పొందాల్సి వ‌స్తోంద‌ని.. అంటున్నారు.

ఇక‌, చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి అయితే.. పూర్తిగా ప‌ద‌వుల‌పై ఆశ‌లు వ‌దిలేసుకుని.. నియోజ‌క‌వ‌ర్గంలో సొంత ప‌నులు చేసుకుంటున్నార‌ని.. స్వయంగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటుంద‌ని.. చెబుతున్నారు. ఇక‌, రోజా అయితే.. ఎదురీత ఈదుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక‌, వైఎస్ హ‌యాంలో ఒక వెలుగు వెలిగిన భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.. మాట ఎక్క‌డా చెల్లుబాటు కావ‌డం లేద‌ని.. అంటున్నారు. ఇలా.. మొత్తంగా చిత్తూరు జిల్లాపై పెద్దిరెడ్డి హ‌వా ఉన్నంత వ‌ర‌కు వీరంతా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలోనే ఉండ‌క త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. మ‌రి జ‌గ‌నైనా.. వీరి క‌ష్టాన్ని గుర్తించాలి క‌దా?! అనే ప్ర‌శ్న‌కు పార్టీలోను.. ప్ర‌భుత్వంలోనూ స‌మాధానం చెప్పేవారు క‌రువ‌వ‌డం గ‌మ‌నార్హం.