తొలి విమానంలో విశాఖకు చంద్రబాబు

ఎట్టకేలకు చంద్రబాబు హైదరాబాదు వీడనున్నారు. ఆయన ఇక్కడి నుంచి ఏపీకి వెళ్లడానికి ఇరు రాష్ట్రాల డీజీపీలు అనుమతి ఇచ్చారు. ఉగాది సమయంలో కుటుంబంతో హైదరాబాదు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు సడెన్ లాక్ డౌన్ తో ఇక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు హైదరాబాదులో ఉన్నాడు. అక్కడ దాక్కున్నాడు అంటూ అధికార పార్టీ నేతలు పలుమార్లు విమర్శించిన విషయం విదితమే. అయితే, లాక్ డౌన్ వల్ల ఉండిపోవాల్సి వచ్చిందని, నిబంధనలు అనుమతించక ఇక్కడే ఉండిపోయానని అందరికీ కలిపి ఒకసారి చంద్రబాబు మీడియాముఖంగా సమాధానమిచ్చారు.

అయితే, అనుకోని విధంగా ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరగడంతో వెంటనే బాధితుల పరామర్శ కోసం అక్కడికి వెళ్లడానికి చంద్రబాబు ప్రత్యేక విమానం కోసం అనుమతి కోరారు. ఏవో కొన్ని కారణాల వల్ల దానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో అపుడు చంద్రబాబు అక్కడికి వెళ్లలేకపోయారు. తాజాగా విశాఖ పర్యటనకు వెళ్లాలని ఇరు రాష్ట్రాల డీజీపీలకు దరఖాస్తు పెట్టుకోవడంతో ఇరువురు ఆమోదం తెలిపారు. ఈ దరఖాస్తులో చంద్రబాబు, లోకేష్, శ్రీనివాస్ అనే మరొక వ్యక్తికి అనుమతి లభించింది.

విమాన ప్రయాణాలు రేపటి నుంచి ప్రారంభం కావడంతో చంద్రబాబు ఉదయం 10 గంటలకు తొలి విమానంలోనే విశాఖకు చేరుకోనున్నారు. విశాఖ సుదూరం కావడంతో అంతదూరం చంద్రబాబు రోడ్డు ప్రయాణం చేయలేకనే విమాన సర్వీసులు ప్రారంభం అయిన వెంటనే పర్యటన ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. ఇక హైదరాబాదు నుంచి నేరుగా విశాఖ శివారులోని ఆర్ ఆర్ వెంకటాపురం లోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రమాద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. విశాఖ పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో చంద్రబాబు విశాఖ నుంచి అమరావతి చేరుకుంటారు.

కొద్దిరోజుల క్రితం విశాఖ పర్యటనకు చంద్రబాబు వెళ్లినపుడు వైసీపీ కార్యకర్తలు ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా ఆందోళన చేయడం, భద్రత రీత్యా పోలీసులు చంద్రబాబును వెనక్కు పంపడం తెలిసిందే. అనుమతి ఉండగా బాబు టూరును ఎలా అడ్డుకుంటారు అంటూ చంద్రబాబు కోర్టుకు వెళ్లడంతో డీజీపీని హైకోర్టు పిలిపించి వివరణ కోరింది. అప్పట్లో ఇది సంచనలం అవగా.. మళ్లీ విశాఖ కచ్చితంగా వస్తాను అంటూ ఆరోజు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇపుడు వాస్తవరూపం దాలుస్తున్నాయి.