అశోక్ గ‌జ‌ప‌తిపై సాయిరెడ్డి మ‌రో ఎత్తుగ‌డ‌.. ఏకంగా ప్ర‌ధానికి లేఖ‌

మాన్సాస్ స‌హా.. సింహాచ‌లం ట్ర‌స్టు బోర్డుల విష‌యంలో టార్గెట్ చేసిన విజ‌య‌న‌గ‌రం జిల్లా టీడీపీ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజుపై వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి మ‌రో బండ ప‌డేశారు. అదికూడా 2017లో జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి ప్ర‌ధానికి లేఖ‌రాయడం గ‌మ‌నార్హం. అప్ప‌ట్లో జ‌రిగిన‌ హిరాఖుడ్ రైలు ప్రమాదం.. విచారణ విషయమై ప్రధాని మోడీకీ ..ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. “విచారణను తప్పుదారి పట్టించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలి” అని ఆయన కోరారు. ట్రాక్ నిర్వహణలో లోపాల కారణంగా జరిగిన ఈ ప్రమాదాన్ని నక్సల్స్ పైకి నెట్టాలని చూశారని ఆరోపించారు.

ట్రాక్‌లో లోపం!

2017 జనవరి 21వ తేదీ అర్థరాత్రి కునేరు రైల్వేస్టేషన్ యార్డు వద్ద పట్టాలు తప్పిన హిరాఖుడ్ ఎక్స్ప్రెస్‌ ప్రమాదంపై జరిగిన విచారణను.. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ తప్పుదోవ పట్టించారని సాయిరెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై అత్యున్నతస్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరిపించి… దోషులకు శిక్ష పడేలా చేయాలని కోరారు. ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందారని, 70 మందికి పైగా గాయాలపాలయ్యారని ప్రధానికి లేఖలో వివరించారు. ట్రాక్ నిర్వహణలో లోపాల కారణంగా జరిగిన ఈ ప్రమాదాన్ని నక్సల్స్ పైకి నెట్టాలని చూశారని… అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సీబీసీఐడీ విచారణను కూడా నాటి డివిజినల్ రైల్వే మేనేజర్ తప్పుదారి పట్టించారని లేఖలో ప్రస్తావించారు.

మేనేజ్ చేశారు!

జాతీయ దర్యాప్తు సంస్థకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చారని విజయసాయి అన్నారు. బీవీవీ రాజు, వాల్తేరు ప్రొటోకాల్ ఆఫీసర్ సీహెచ్ విష్ణుమూర్తిల ద్వారా రూ. లక్షల రూపాయలు ఖర్చు చేసి విచారణను మేనేజ్ చేయించారని మండిపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత రోజు తెల్లవారుజామునే కొందరు కాంట్రాక్టు కార్మికులను తీసుకెళ్లి రైలు పట్టాల దగ్గర మార్పులు చేసి… ప్రమాదాన్ని నక్సల్స్ పైకి నెట్టాలని చూశారని పేర్కొన్నారు. నక్సల్స్ ట్రాక్ను ధ్వంసం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అందరినీ నమ్మించారని.. ఆరోపించారు. వాస్తవానికి ప్రమాదం రైల్వే స్టేషన్ యార్డులో, ఆపరేటింగ్ క్యాబిన్ సమీపంలో జరిగిందని గుర్తు చేశారు.

రిపోర్టు ఇదేన‌ట‌!

ఈ ప్రమాదానికీ, నక్సల్స్కు ఎలాంటి సంబంధం లేదని రాయగఢ్ ఎస్పీ, ఒడిశా డీజీపీలు స్పష్టం చేశారన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నిరంతరాయంగా కాపలా , రైల్వే స్టాఫ్ కూడా తిరుగుతుంటారని.. అలాంటి చోటుకు నక్సల్స్ వచ్చి ట్రాక్‌ను దెబ్బతీయటం సాధ్యం కాదని చెప్పారన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు సైతం.. ఈ ప్రమాదానికీ, నక్సల్స్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారన్నారు.

ఆత్మ‌ల‌కు శాంతి లేద‌ట‌!

కమిషనర్, రైల్వే సేఫ్టీ (సీఆర్ఎస్) ద్వారా జరిగిన విచారణను నాటి కేంద్ర మంత్రి అశోక్ ప్రభావితం చేశారని తెలిపారు. ప్రమాదం జరిగిన నాలుగేళ్ల తర్వాత కూడా ఎన్ఐఏ నుంచి ఎలాంటి చర్యలు లేవని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారంతా గిరిజనులు, పేద ప్రజలేనని, ప్రమాదానికి కారకులైన వారిని వదిలేస్తే మృతుల ఆత్మలకు శాంతి ఉండదన్నారు. ఎన్ఐఏ నివేదికను విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టేలా అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, వాస్తవాలను వెలికితీసి, బాధ్యులను శిక్షించాలని ప్రధానమంత్రిని కోరారు.