రేవంత్ బిజీబిజీ

ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంతో అధికార ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేందుకు ఎప్ప‌డూ సిద్ధంగా ఉండే నాయ‌కుడిగా ఆ దిశ‌గా అవ‌కాశం వ‌స్తే ఎలా దూకుడు చూపిస్తారో అనేదానికి తెలంగాణ ప్ర‌దేశ్‌ కాంగ్రెస్ క‌మిటీ నూత‌న అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి జోరే నిద‌ర్శ‌నం.

ఇటీవ‌ల టీపీసీసీ కొత్త అధ్య‌క్షుడు ఎంపికైన ఆయ‌న పార్టీ అధిష్ఠానం త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకునే దిశ‌గా స‌రికొత్త ఉత్సాహంతో ప‌నిచేస్తున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టే దిశ‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. ర్యాలీలు, విమ‌ర్శ‌లు, దీక్ష‌ల‌తో బిజీబిజీగా గ‌డుపుతున్నారు.

తెలుగుదేశం పార్టీతో రాజ‌కీయ జీవితాన్ని ఆరంభించిన రేవంత్ కొడంగ‌ల్ నుంచి 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2017లో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయ‌న‌.. 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. 2019లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి నుంచి ఎంపీగా విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు.

అప్ప‌టి నుంచే అధికార టీఆర్ఎస్‌పై దూకుడుతో వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న‌కు తాజాగా టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి మరింత బ‌లాన్ని చేకూర్చింది. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి దిగ‌జారుతుండ‌డంతో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు సీనియ‌ర్ల అభిప్రాయాల‌నూ సైతం ప‌క్క‌న‌పెట్టిన అధిష్ఠానం.. రేవంత్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దీనిపై సీనియ‌ర్ల తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

అయిన‌ప్ప‌టికీ ముందు పార్టీ ప్ర‌క్షాళ‌న మొద‌లెట్టిన ఆయ‌న సీనియ‌ర్ల‌తో మాట్లాడి బుజ్జ‌గించే ప్ర‌య‌త్నంతో చేయ‌డంతో పాటు అధికార పార్టీకి కోవ‌ర్టులుగా ఉన్న నేత‌ల ప‌ని ప‌డ‌తాన‌ని హెచ్చ‌రించారు. దీంతో రాష్ట్రంలో వాత‌మొచ్చిన చేతికి ఊతం దొరికింద‌ని కార్య‌క‌ర్త‌లు సంతోష‌ప‌డుతున్నారు.

ఆకాశాన్ని అట్టుతున్న పెట్రోలు, డీజిల్ రేట్ల‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని బాధ్యుల‌ను చేస్తూ ఆయ‌న నిర్వ‌హించిన ర్యాలీలు కాంగ్రెస్ శ్రేణుల్లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. డైన‌మిక్ లీడ‌ర్‌గా అభిమానుల్లో గుర్తింపు పొందిన రేవంత్ ఇప్పుడు అదే జోరుతో కొన‌సాగుతున్నారు. తాజాగా ప్ర‌భుత్వ భూములను వేలం వేయ‌డంలో అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వెయ్యి కోట్ల కుంభ‌కోణానికి పాల్ప‌డింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ విష‌యంపై స్పందించి భూముల వేలం ర‌ద్దు చేసి స్విస్ విధానంలో మ‌ళ్లీ టెండ‌ర్లు పిల‌వాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం స‌మాధానం ఇవ్వ‌క‌పోతే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పారు. మ‌రోవైపు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌పైనా విమ‌ర్శ‌ల‌ను ఎక్కుపెట్టారు. ఆయ‌న‌పై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల‌ను విచారించాల‌ని, ఆయ‌న‌కు సీఎస్ అయ్యే అర్హ‌తే లేద‌ని రేవంత్ ఆరోపించారు.

పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేల‌పై చ‌ట్ట‌ప‌రంగా పోరాటం చేయాల‌ని తాజాగా ఆయ‌న నేతృత్వంలోని టీపీసీసీ నిర్ణ‌యించింది. మ‌రోవైపు నిరుద్యోగ స‌మ‌స్య‌పై పోరాడేందుకు 48 గంట‌ల నిరాహార దీక్ష చేసేందుకూ సిద్ధ‌మ‌య్యారు. ఈ ర‌కంగా నిత్యం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనే పోరాడుతూ రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా రేవంత్ రెడ్డి బిజీబిజీగా గ‌డ‌ప‌నున్నారు.