సాయిరెడ్డి వ్యూహంతో అస‌లుకు ఎస‌రు..?

మ‌రో నాలుగు రోజుల్లో పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. దాదాపు 19 రోజుల పాటు ఈ స‌మావేశా లు జ‌రుగుతాయ‌ని ఇప్ప‌టికే వెల్ల‌డైంది. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంటులో ఎలా వ్య‌వ‌హ‌రించాలి? ఏయే స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాలి? అనే విష‌యాల‌పై చ‌ర్చించేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. గురువారం ప్ర‌త్యేకంగా స‌మావేశం నిర్వ‌హించారు.

లోక్‌స‌భ స‌భ్యులు 21 మంది(ర‌ఘురామ మిన‌హా), రాజ్య‌స‌భ స‌భ్యులు ఈ స‌మావేశానికి హాజ‌రుకావాలంటూ.. ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలో పార్టీ పార్ల‌మెంట‌రీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ ఎంపీ.. విజ‌య‌సాయిరెడ్డి ఒక కీల‌క ప్ర‌తిపాద‌న‌తో జ‌గ‌న్ ముందుకు వ‌స్తున్న‌ట్టు ముందుగానే మీడియాకు లీక్ చేశారు.

అయితే.. సాయిరెడ్డి వ్యూహానికి ఎక్కువ మంది ఎంపీలు విముఖత వ్య‌క్తం చేస్తున్నారు. “ఈ స‌మ‌యంలో ఇలాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వ‌డంస‌ముచితం కాదు!” అని సీమ జిల్లాకు చెందిన ఒక ఎంపీ బాహాటంగానే అంటున్నారు. ఇక‌, ప్ర‌కాశం జిల్లాకు చెందిన మ‌రో ఎంపీ కూడా “సాయిరెడ్డి ఎంచుకున్న అంశంపై చ‌ర్చ‌కు మ‌న‌మే తొంద‌ర‌ప‌డ‌డం స‌రికాదు!” అని వ్యాఖ్యానిం చారు.
అయితే.. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఒక యువ ఎంపీ మాత్రం సాయిరెడ్డికి జైకొడుతున్నారు. ‘ఈవిష‌యంలో దూకుడు చూపించాల్సిందే” అంటున్నారు. మొత్తంగా చూస్తే.. సాయిరెడ్డి వ్యూహానికి ఎక్కువ మంది సీనియ‌ర్లు విముఖ‌త వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ సాయిరెడ్డి ఎంచుకున్న వ్యూహం ఏంటంటే.. పార్టీ ఎంపీ, ఇటీవ‌ల కాలంలో సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ర‌ఘురామ‌రాజుపై అన‌ర్హ‌త వేటు వేయించ‌డ‌మే. ఇప్ప‌టికే దీనికి సంబంధించి సాయిరెడ్డి మాస్ట‌ర్ ప్లాన్ త‌యారు చేసుకున్నార‌ని.. అంటున్నారు.

ఇటీవ‌ల ఆయ‌న “ర‌ఘురామ విష‌యంలో అవ‌స‌ర‌మైతే.. స‌భ‌ను స్తంభింప‌జేస్తా”మ‌ని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఇదే విష‌యాన్ని రాజ్య‌స‌భ‌లోనూ లోక్‌స‌భ‌లోనూ ప్ర‌ధానంగా ప‌ట్టుబ‌ట్టాల‌నేది ఆయ‌న వ్యూహంగా క‌నిపిస్తోంది. కానీ, ఇప్పుడున్న రాష్ట్ర ప‌రిస్థితిలో సొంత పార్టీ ఎంపీపై ఇలా ప‌ట్టుబ‌ట్టి.. ఇత‌ర అంశాల‌ను ప్ర‌స్తావించ‌క‌పోతే.. పార్టీపై నెగిటివ్ థింకింగ్ పెరుగుతుంద‌ని.. అప్పుడు ఏమీ చేయ‌లేమ‌నేది సీనియ‌ర్ల మాట‌.

సీనియ‌ర్లు చెబుతున్న కీల‌క విష‌యం ఏంటంటే.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విష‌యం, కుదిరితే ప్ర‌త్యేక హోదా, మ‌రీముఖ్యంగా కృష్ణాజలాల‌కు సంబంధించిన ప‌రిధి నిర్ణ‌యం, దిశ చ‌ట్టం అమ‌లు, మూడు రాజ‌ధానులు.. ఇలా కీల‌క‌మైన అంశాల‌పై పార్ల‌మెంటులో ప్ర‌స్తావించ‌డం ద్వారా.. ఇప్పుడు రాష్ట్రంలో నెల‌కొన్న ఒకింత వ్య‌తిరేక‌త‌ను ప‌క్క‌న పెట్టొచ్చ‌నివారు చెబుతున్నారు.

కానీ.. ఎవ‌రి మాట‌నూ నెగ్గ‌నివ్వ‌ని.. సాయిరెడ్డి మాత్రం.. త‌న వ్యూహం ప్ర‌కారం ర‌ఘురామ అంశానే టేబుల్ ఐటంగా జ‌గ‌న్ ముందు ఉంచుతార‌ని పార్టీలో చ‌ర్చ సాగుతోంది. మ‌రి దీనిపై జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌య‌మే కీల‌కం కానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ కూడా ర‌ఘురామ ఐటంను చివ‌ర‌గా ప్ర‌స్తావించాల‌ని ప్ర‌తిపాదించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.