జగన్, కేసీఆర్‌లను ఇరికించేసిన షర్మిల

Sharmila


ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుంటే.. ఇంకోవైపు ఆయన సోదరి షర్మిళ తెలంగాణలో వైఎస్సార్ తెలాంగాణ పార్టీ పేరుతో రంగంలోకి దిగడం పట్ల అందరూ నోరెళ్లబెడుతున్నారు. అన్నతో విభేదిస్తే ఆయనకు పోటీగా ఏపీలో పార్టీ పెట్టాలి కానీ.. ఇలా తెలంగాణలో వచ్చి పార్టీ నెలకొల్పడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కడప జిల్లాలో పుట్టి పెరిగి అక్కడ భాష, యాసనే మాట్లాడే షర్మిళ తెలంగాణను ఓన్ చేసుకుంటూ తాను ఈ ప్రాంత కోడలిని అనడం.. నీటి గొడవల విషయానికి వస్తే తాను తెలంగాణ పక్షమే అన్నట్లుగా మాట్లాడటం విడ్డూరంగా అనిపిస్తోంది జనాలకు. షర్మిళ మాట.. చేతనే కాక పార్టీకి సంబంధించి ప్రతిదీ నాటకీయంగా అనిపిస్తుండటం గమనార్హం. ఐతే పార్టీ ఆవిర్భావం సందర్భంగా షర్మిళ చేసిన ఒక వ్యాఖ్య మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఏ ఉద్దేశంతో ఆ మాట అందో ఏమో కానీ.. షర్మిళ చేసిన వ్యాఖ్యతో తెలంగాణ, ఆంధ్ర్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇరుకున పడిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒకప్పటి బంధం గురించి మాట్లాడుతూ.. ఇద్దరూ ఒక చోట కలుస్తారు. కౌగిలించుకుంటారు.. కలిసి భోంచేస్తారు.. స్వీట్లు తినిపించుకుంటారు.. ఉమ్మడి శత్రువును ఓడిస్తారు.. కానీ నీటి గొడవల మీద రెండు నిమిషాలు కూర్చుని మాట్లాడుకుని దీన్ని పరిష్కరించుకోలేరా అని షర్మిళ ప్రశ్నించింది. షర్మిళ ఉద్దేశం ఏదైనప్పటికీ.. ఇది చాలా లాజికల్ ప్రశ్న.

గత ఎన్నికల్లో విజయానంతరం జగన్.. కేసీఆర్ ఇంటికి వెళ్లడం.. ఆయన సాదరంగా ఆహ్వానించడం.. ఇద్దరూ మంచి మిత్రుల్లా కనిపించడం తెలిసిందే. రెండేళ్ల పాటు ఇరువురి మధ్య స్నేహం కొనసాగింది. జగన్ ఎప్పుడూ కేసీఆర్‌పై ఒక్క విమర్శ చేసింది లేదు. ఇప్పుడు జల వివాదాల విషయంలో మాత్రం ఇద్దరూ శత్రువుల్లా కనిపిస్తున్నారు. ఐతే ఈ గొడవ పెద్ద డ్రామా అని.. సులువుగా పరిష్కరించుకునే విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కావాలనే వివాదంగా మార్చి ఎవరి రాష్ట్రం కోసం వాళ్లు పోరాడుతున్న ఫీలింగ్ జనాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శకులు అంటున్నారు. షర్మిళ ఇదే విషయాన్ని ఎత్తి చూపేలా మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది.