మోడీనే బెదిరించాలని చూశాడా ?

కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో చిరాగ్ పాశ్వాన్ బ్లాక్ మెయిలింగ్ నరేంద్రమోడి ముందు పనేయలేదు. కొద్దిరోజులుగా బీహార్ లో లోక్ జన శక్తి (ఎల్జేపీ)లో చాలా గొడవలవుతున్న విషయం తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఎంపి చిరాగ్ పాశ్వాన్ ను దింపేసి ఆయన సొంత బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ అధ్యక్షుడైపోయాడు. అలాగే లోక్ సభలో సభా నాయకుడిగా చిరాగ్ ను తీసేసి మరో ఎంపిని పశుపతి వర్గం ఎంపిలు ఎన్నుకున్నారు.

సో ఈ విషయంలో పాశ్వాన్ కుటుంబంతో పాటు పార్టీలో కూడా పెద్ద గొడవలే అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే చిరాగ్ రెండో రోజుల క్రితం ఓ ప్రకటన చేశారు. కేంద్రమంత్రివర్గంలోకి పశుపతిని తీసుకుంటే తాను కోర్టులో కేసు వేస్తానని మోడిని హెచ్చరించారు. డైరెక్టుగా మోడి పేరు పెట్టి ఎక్కడా హెచ్చరికలు పంపలేదు. అయితే చిరాగ్ చేసిన హెచ్చరిక మోడికే అని అందరికీ తెలుసు. ఎందుకంటే మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా ప్రధానమంత్రి ఇష్టమే కాబట్టి.

తమ గొడవలను ప్రధానమంత్రి మెడకు చుట్టాలని చిరాగ్ ప్లాన్ వేశారు. తాను చేసిన హెచ్చరికలతో మోడి దిగొస్తారని అనుకున్నట్లున్నారు. అయితే ఎల్జేపీలో కేవలం ఒకే ఒక్కడుగా మిగిలిపోయిన ఎంపి చిరాగ్ ను మోడి ఎందుకు పట్టించుకుంటారు. నెంబర్ గేమ్ ప్రకారం ఆరుగురు ఎంపిలున్న పశుపతికే ప్రాధాన్యత ఇచ్చారు. అంటే చిరాగ్ బెదిరింపులను మోడి ఏమాత్రం ఖాతరు చేయలేదని అర్ధమైపోతోంది.