ఫేక్ కరోనా సర్టిఫికెట్ తో టోకరా.. అఖిల ప్రియ భర్తపై మరో కేసు

మాజీ మంత్రి అఖిలప్రియ కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ఆమె భర్త కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆమె భర్త భార్గవ్ రామ్ పై మరో కేసు నమోదైంది.

నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో భార్గవ్‌ రామ్‌తోపాటు ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డిపై నకిలీ కొవిడ్‌ సర్టిఫికెట్‌ కేసు నమోదయింది. కోర్టు విచారణకు హాజరుకాకుండా నకిలీ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కిడ్నాప్‌ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్‌, జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి ఈ నెల 3న కోర్టులో హాజరుకావాల్సి ఉన్నది.

అయితే కోర్టుకు హాజరుకాకుండా ఉండటానికి భార్గవ్ రామ్ సర్టిఫికెట్ అందించారు. ఈనెల 1న ఆయన నకిలీ సర్టిఫికెట్‌ సమర్పించినట్లు భార్గవ్ రామ్‌పై అభియోగాలు మోపారు. కరోనా కారణంగా కోర్టుకు హాజరు కాలేమని అందులో పేర్కొన్నారు.

అయితే కొవిడ్‌ సర్టిఫికెట్లను బోయిన్‌పల్లి పోలీసులు పరిశీలించారు. ఇందులో భాగంగా ఆ సర్టిఫికెట్‌ ఇచ్చిన ఆస్పత్రిలో విచారించారు. ఈ సందర్భంగా నకిలీ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు ధ్రవీకరించారు. నకిలీ సర్టిఫికెట్‌ ఇచ్చిన దవాఖాన సిబ్బంది వినయ్‌, రత్నాకర్‌, శ్రీదేవిపై కేసు నమోదుచేశారు.