రేవంత్ ముందు జాగ్రత్త

కొత్తగా తెలంగాణా పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి కాస్త జాగ్రత్తగానే నడుచుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే నూరుశాతం ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న పార్టీ. రాష్ట్ర అధ్యక్షుడిని తిడతారు, జాతీయ అధ్యక్షురాలిపై నోటికొచ్చింది మాట్లాడేస్తారు. మళ్ళీ ఎన్నికల్లో టికెట్ తెచ్చేసుకుంటారు. కోపం వచ్చినపుడు తిట్టేయటం, ఆరోపణలు చేసేయటం మళ్ళీ టికెట్ తెచ్చేసుకోవటం కాంగ్రెస్ పార్టీలో అత్యంత సహజం. అందుకనే పార్టీ నుండి నేతలెవరినీ అధిష్టానం బయటకు పంపేయటం చాలా చాలా తక్కువనే చెప్పాలి.

ఇటువంటి వ్యక్తిస్వేచ్చ అపరిమితంగా ఉన్న పార్టీకి జూనియర్ మోస్ట్ నేత రేవంత్ అధ్యక్షుడయ్యారు. దాంతో సహజంగానే పార్టీలో అసంతృప్తులు బయలుదేరాయి. బహుశా ఈ విషయం గమనించే రేవంత్ కూడా కాస్త తెలివిగా వ్యవహరిస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సీనియర్ నేత వీ హనుమంతరావును కలిసొచ్చారు. అలాగే మరి కొందరు నేతల ఇళ్ళకు వెళ్ళి వాళ్ళతో భేటీ అయ్యారు.

తాజాగా మీడియాతో మాట్లాడుతు పార్టీలో తనకన్నా సీనియర్లు, అనుభవజ్ఞులు చాలామందున్నా పీసీసీ పగ్గాలు తనకు అప్పగించినట్లు అంగీకరించారు. కాంగ్రెస్, టీడీపీ నుండి టీఆర్ఎస్ లో జాయిన అయిన నేతలతో మాట్లాడుతానని స్పష్టంచేశారు. ఘర్ వాపసీ ప్రోగ్రామ్ ను అమలు చేస్తానన్నారు. ఇందుకోసం సీనియర్లతో చర్చించి ప్లాన్ చేస్తానని చెప్పటం గమనార్హం. నిజానికి రేవంత్ తో పాటు చాలామంది సీనియర్లు పీసీసీ పగ్గాల కోసం పోటీపడ్డారు.

అయితే ఎవరికి వాళ్ళుగా పోటీ పడటంతో ఉన్న వాళ్ళల్లో రేవంతే బెటర్ అనుకుని అధిష్టానం పగ్గాలను అప్పగించింది. రేవంత్ కు పోటీగా ఉన్న వాళ్ళంతా ఏకమై ఒకే అభ్యర్ధిని ప్రతిపాదించుంటే కచ్చితంగా సదరు అభ్యర్ధికే పీసీసీ అధ్యక్ష పీఠం దక్కేదనటంలో సందేహంలేదు. ఈ విషయం రేవంత్ కు కూడా బాగా తెలుసు. అందుకనే ప్రతి విషయంలోను సీనియర్లతో చర్చలు జరుపుతానని, సీనియర్లతో కమిటి వేస్తానని చెబుతున్నారు. తనక వ్యతిరేకంగా ఉన్న సీనియర్లను కలుపుకుని పోవటంలో రేవంత్ తెలివిగా వ్యవహిరిస్తున్నట్లే అనిపిస్తోంది.