పోల‌వ‌రం..’ముంపు’ పాపం ఎవ‌రిది?


పోల‌వ‌రం ప్రాజ‌క్టు ప‌రిధిలోని 200 గ్రామాలు మునిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం గోదావ‌రికి వ‌స్తున్న వ‌ర‌ద కార‌ణంగా.. ఈ ప్రాంతంలో నీరు పోటెత్త‌డంతో.. నిర్వాసిత గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా నీట‌మునిగి ప్ర‌జ‌లు రోడ్డున ప‌డ్డారు. ముఖ్యంగా గోదావ‌రి వ‌రద ఉదృతితో కాఫ‌ర్ డ్యామ్‌కు ఎగ‌ద‌న్నుతున్న నీరు.. వెన‌క్కి మ‌ళ్లి.. గ్రామాల‌ను ముంచేస్తోంది. ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో బాధ‌ప‌డుతున్న‌ది ప్ర‌జ‌లైతే.. మ‌రి పాపం ఎవ‌రిది? ఏ ప్ర‌భుత్వానిది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇక‌, గోదావ‌రికి వ‌ర‌ద పోటెత్తిన‌ప్పుడు.. స‌హ‌జంగానే పోల‌వ‌రం, దేవీప‌ట్నం.. స‌హా అనేక గ్రామాల‌కు వ‌ర‌ద పోటెత్తేది. అయితే.. ఇప్పుడు కాఫ‌ర్ డ్యామ్ కార‌ణంగా.. ఇది మ‌రింత పెరిగింది.

భద్రాచలం వద్ద ఏటా 48 అడుగుల నీటిమట్టం నమోదయిన పక్షంలోనే తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం కొంతలో కొంత ముంపుకు గురయ్యేది. కానీ నీటిమట్టం అంతగా లేకున్నా ఇప్పుడు దేవీపట్నం వైపు వరద పెరుగుతూ వస్తోంది. భద్రాచలం వద్ద 56 అడుగుల నీటి మట్టం నమోదు అయినప్పుడు కుక్కునూరు, వేలేరుపాడు ముంపు మండలాల్లో దాదాపు 25పైగా గ్రామాలు వరద తాకిడికి గురయ్యేవి. తిరిగి వారంలోపే కుదుటపడేవి. కానీ ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ వల్ల మండల కేంద్రమైన వేలేరుపాడు సమీపాన గోదావరి అంతకంతకూ పెరుగుతూ పోతోంది. దీంతో గ్రామాలు మునిగిపోతున్నారు.

ఈ విష‌యం.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వాని కంటే కూడా.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికే ఎక్కువ‌గా తెలుసు..! ఎందుకంటే.. ఆయ‌నే పోల‌వ‌రంపై ప్ర‌తి సోమ‌వారం స‌మీక్ష‌లు పెట్టి.. సోమ‌వారాన్ని పోల‌వారంగా మార్చుకున్నారు. మ‌రి ఈ స‌మ‌యంలో ముంపు బాధితుల‌కు నివాసాలు క‌ట్టించే విష‌యంపై చంద్ర‌బాబు ఏం చేశార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇప్ప‌టికీ నిర్వాశితుల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలూ క‌ల్పించ‌లేదు. పైగా.. దీనిపై కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల‌ను కూడా వ‌దులుకున్నార‌ని.. అంటే.. అంచ‌నాలు పెంచాల్సిన స‌మ‌యంలో నిర్వాశితుల స‌మ‌స్య‌ను.. కేంద్రం వ‌దిలించుకునేందుకు ప్ర‌య‌త్నించింది. దీనికి చంద్ర‌బాబు ప‌చ్చ‌జెండా ఊపారు. ఇలా.. మొత్తంగా చూస్తే.. నిర్వాసితుల‌కు గ‌త ప్ర‌భుత్వంలో ఏమీ మిగ‌ల్లేదు.

ఇక‌, ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం వ‌చ్చి రెండేళ్లే అయింది.. అయితే.. కొంత‌మేర‌కు చేసే అవ‌కాశం ఉండ‌డంతో చేశారు. అయితే..కేంద్రం నుంచి వివాదం నెల‌కొన‌డంతో.. వైసీపీ ప్ర‌భుత్వం కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు తాజాగా.. పోల‌వ‌రం గ్రామాలు వ‌ర‌ద తాకిడికి మునిగిపోయాయి. గిరిజ‌నులు, మ‌త్స్య‌కారులు.. రోడ్డున ప‌డ్డారు. మ‌రి ఇది.. ఎవ‌రి పాపం.? చంద్ర‌బాబుదా? జ‌గ‌న్‌దా? ఎవ‌రిదైనా.. ఇప్పుడు ప్ర‌ధానంగా న‌ష్ట‌పోతోంది మాత్రం జ‌నాలే. మ‌రి ఇప్ప‌టికైనా.. చ‌ర్య‌లు తీసుకుంటారో.. లేదో చూడాలి.