మంటలెక్కిస్తున్న మోడి

Modi

జనాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి మంటలెక్కిస్తున్నారు. ఒకవైపు పెట్రోలు, డీజల్ ధరలు పెంచేస్తున్న మోడి సర్కార్ తాజాగా గ్యాస్ బండ ధరను కూడా పెంచేసింది. గోడ దెబ్బ చెంపదెబ్బ లాగ ఒకవైపు ఫ్యూయల్ ధరల పెంపు, మరోవైపు గ్యాస్ ధరల పెరుగుదల. మొత్తానికి కేంద్రం జనాలను రెండు వైపులా వాయించేస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటర్ కు 100 రూపాయలు దాటిపోయింది. అలాగే డీజల్ లీటర్ ధర వంద రూపాయలకు దగ్గరలో ఉంది.

అంతర్జాతీయ స్ధాయిలో క్రూడాయిల్ ధరలు బాగా తక్కువగా ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం ఫ్యూయల్ ధరలను తగ్గించటం లేదు. ధరలను తగ్గించటం మాటపక్కన పెట్టేసి ఏరోజుకా రోజు ధరలను పెంచుకుంటుపోతోంది. కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజలపై చేసిన ఖర్చు మొత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు ఇలా ధరలను పెంచుతోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

పెట్రోలు, డీజల్ ధరల పెంపుపైనే ఏడాదికి కేంద్రానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇది చాలాదన్నట్లుగా తాజాగా గ్యాస్ ధరను కూడా బాగా పెంచేసింది. ఇళ్ళల్లో వాడుకునే సిలిండర్ల ధర 25 రూపాయలు పెంచిన కేంద్రం వాణిజ్యావసరాలకు వాడే సిలిండర్ల ధరను 84 రూపాయలు పెంచింది. మొత్తానికి మోడి మాత్రం జనాలకు మంటలెక్కిస్తున్నారు.