మన టీకాలకు ఓకే చెప్పని ఈయూకి భారత్ వార్నింగ్

దేశీయంగా తయారు చేసిన కొవాగ్జిన్.. కోవీషీల్డ్ లకు సంబంధించి కొన్ని దేశాలు వ్యవహరిస్తున్న తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇంతకాలం ఎంతలా చెప్పినా మాట వినని దేశాలకు.. తనదైన శైలిలో సమాధానం చెప్పటం షురూ చేసింది. కొవిడ్ 19కు చెక్ పెట్టే వ్యాక్సిన్లలో భారత్ లో రూపొందించిన సీరం వారి కోవిషీల్డ్.. భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకాల్ని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేస్తున్నారు. ఈ టీకా కార్యక్రమం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఈ టీకాలు వేయించుకున్న వారు యూరోపియన్ దేశాలకు వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. భారత్ కు చెందిన రెండు టీకాల్ని గుర్తించేందుకు ఈయూ ససేమిరా అంటోంది. దీనికి సంబంధించిన వివరాల్నిఇప్పటికే ఆయా దేశాలతో భారత్ చెప్పినా.. మాట వినని పరిస్థితి. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాలకు అర్థమయ్యే మాటను భారత్ చెప్పటం షురూ చేసింది.

తమ టీకాలను యూరోపియన్ దేశాలు గుర్తించని పక్షంలో.. వారి దేశస్తులు భారత్ కు వస్తే వారిని తాము కూడా గుర్తించమని స్పష్టం చేసింది. యూరోపియన్ దేశాల గ్రీన్ పాస్ స్కీంలో భారత్ టీకాలకు చోటు కల్పించని పక్షంలో.. తాము కూడా ఈయూ దేశాలకు చెందిన వారు భారత్ కు వస్తే.. వారి వ్యాక్సిన్లను తాము గుర్తించమని స్పష్టం చేశారు. అదే జరిగితే.. ఆయా దేశాల వారు భారత్ కు వచ్చిన తర్వాత తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాల్సి వస్తోంది. మరి.. ఇప్పటికైనా ఈయూ దేశాల తీరు మారుతుందో లేదో చూడాలి.