భారత్ కు డేంజర్..డేంజర్

ఇంతకుముందు ఒక లెక్క..ఇప్పటి నుండి ఒక లెక్క అన్న సినిమా డైలాగులాగ భారత్ కు డేంజర్ పొంచుంది. సరిహద్దుల్లో ఎప్పుడేమి జరుగుతుందో తెలీక త్రివిధ దళాల ఉన్నతాధికారులతో పాటు పాలకుల్లో కూడా టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన మూడు రోజుల్లో రెండుసార్లు పాకిస్ధాన్ ప్రేరిపిత ఉగ్రవాదులు ద్రోన్లతో బాంబులు పేల్చిన విషయం తెలిసిందే. నిజంగా మనకు అదృష్టం ఉండబట్టి సరిపోయింది కానీ లేకుండా ఎంతటి నష్టం జరిగుండేదో తలచుకుంటేనే భయమేస్తుంది.

సైన్యాధికారుల లెక్క ప్రకారం గడచిన రెండేళ్ళల్లో పాకిస్ధాన్ నుండి మన భూభాగంలోకి 300 ద్రోన్లు దూసుకొచ్చాయట. వీటన్నింటినీ ఆయుధాలను మోసుకురావటం, మాదక ద్రవ్యాల సరఫరాకు మాత్రమే ఉపయోగించారు. అంటే గడచిన మూడు రోజుల్లో మాత్రమే బాంబుల పేలుడులో ద్రోన్లను ఉగ్రవాదులు ఉపయోగించారని స్పష్టమైపోతోంది.

అధికారులు చెబుతున్న 300 ద్రోన్లు మన సైన్యం గుర్తించినవి మాత్రమే. మనవాళ్ళ కంటపడకుండా సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చిన ద్రోన్ల సంఖ్య ఎంతో తెలీదు. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం అలాంటి ద్రోన్లు కొన్ని వేలుంటాయట. ఇపుడు బాంబుల పేలుళ్ళలో ఉపయోగించారు కాబట్టి ఇకనుండి సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చే ప్రతి ద్రోన్ను మారణహోమానికే ఉగ్రవాదులు ఉపయోగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని మిలిటరీ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

భారత్-పాకిస్ధాన్ సరిహద్దంటే కొన్ని వేల కిలోమీటర్లుంటుంది. ఇన్ని వేల కిలోమీటర్లను 24 గంటలూ కాపలా కాయటం మామూలు విషయం కాదు. అందుకనే పాకిస్ధాన్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మనదేశం కూడా యాంటీ ద్రోన్ వ్యవస్ధ తయారీపైన బాగా దృష్టిపెట్టింది. ఇందుకు ఇజ్రాయెల్ టెక్నాలజీని సాయంగా తీసుకుంటోంది.

ఈ సమస్య పాకిస్ధాన్ తో మాత్రమే ఆగదు. డ్రాగన్ దేశం తరపున కూడా మొదలయ్యే అవకాశం ఉంది. అసలిప్పటికే రెండు దేశాలు కలిపే ఆపరేషన్ మొదలుపెట్టాయేమో కూడా అనుమానంగానే ఉంది. ఏదేమైనా ఇక నుండి ద్రోన్ల ప్రయోగం ద్వారా భారత్ సరిహద్దుల్లో విధ్వంసాలకు పాల్పడే ప్రమాధం ఉందని తేలిపోయింది. కాబట్టి మన సైన్యం అప్రమత్తంగా ఉండటమే కాకుండా యాంటీ ద్రోన్ టెక్నాలజిని ఎంత తొందరగా రెడీ చేసుకుంటే అంతమంచిది.