ఫుట్ బాల్ క్రీడాకారుడు.. రోజుకూలీగా ఎందుకు మారాడు?

ప్రపంచాన్ని కరోనా కు ముందు.. తర్వాత అన్న విభజన రేఖ తప్పనిసరి. రానున్న రోజుల్లో ఇదే తరహా పోలిక.. ప్రస్తావన తరచూ చేయటం ఖాయం. ఎందుకంటే.. గడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేనంత మహా సంక్షోభాన్ని ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఎంత చెట్టుకు అంతగాలి అన్న చందంగా.. అందరూ ప్రభావితమయ్యారు. వలస కార్మికుల కష్టాలు కళ్లకు కట్టినట్లుగా ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తే.. చాలామంది దిగువ.. మధ్యతరగతి జీవుల కష్టాలు నాలుగు గోడల్లోనే బందీ అయ్యాయి.

తాజాగా ఒక ఫుట్ బాల్ క్రీడాకారుడు.. తాజా పరిణామాల నేపథ్యంలో రోజుకూలీగా మారిపోయిన దైన్యం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఈజిప్టు రాజధాని కైరోకు దక్షిణాన ఉన్న మన్ ఫలుట్ అనే చిన్న పట్టణంలో మాహరుస్ మహమూద్ అనే పుట్ బాల్ క్రీడాకారుడు ఉన్నాడు. పదహారేళ్లకే ప్రొషెషనల్ గా మారిన అతను ఒక క్లబ్ తరఫున ఆడుతుండేవాడు.

ఆటతో వచ్చే ఆదాయం అంతంతమాత్రంగా ఉండటంతో పార్ట్ టైమ్ ఉద్యోగం చేసేవాడు. కరోనాతో అన్ని దేశాల్లో విధించిన చందంగానే ఈజిప్టులోనూ లాక్ డౌన్ విధించారు. దీంతో.. క్లబ్ మూసేశారు. ఆట ఆగింది. దీంతో పాటు.. పార్ట్ టైం జాబ్ బంద్ అయింది. దీంతో.. కుటుంబాన్ని ఆదుకునేందుకు అతను ఏదో ఒక పని చేయక తప్పని పరిస్థితి.

ఈ నేపథ్యంలో భవన నిర్మాణ సంస్థలో రోజువారీ కూలీగా పని చేయటం షురూ చేశారు. అక్కడ కూడా పని పోవటంతో ప్రస్తుతం బేకరీలో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. పిండి వంటలు చేస్తూ.. వచ్చే డబ్బుతో బతికేస్తున్నాడు. మరి.. కరోనా ముప్పు భయం లేదా? అంటే.. ఎందుకు లేదు? ఆ భయంతో ఇంట్లో ఉంటే.. ఇంట్లో వారికి డబ్బులు ఎవరు ఇస్తారు? అని ప్రశ్నించే వైనం అయ్యో అనిపించకమానదు.