జగన్ పై పెరిగిపోతున్న ఒత్తిడి

తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి ఛైర్మన్, సభ్యుల నియామకం విషయంలో జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. టీటీడీ ట్రస్టుబోర్డు ఛైర్మన్ లేదా సభ్యుడిగా ఉండటం చాలామందికి తీరని కలనే చెప్పాలి. ఒకపుడు బోర్డు ఛైర్మన్ కానీ సభ్యులుగా నియమితులయ్యే వారిని జనాలు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ గడచిన పాతికేళ్ళల్లో టీటీడీ ట్రస్టుబోర్డుకు రాజకీయ గ్లామర్ తోడవ్వటంతోనే ఈ పోస్టులకు బాగా క్రేజు పెరిగిపోయింది. ఎప్పుడైతే క్రేజ్ పెరిగిపోయిందో అప్పుడే డిమాండూ పెరిగిపోయింది.

జగన్ అధికారంలోకి రాగానే ట్రస్టుబోర్డు ఛైర్మన్ గా బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నియమించారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ సీటు కేటాయించలేని కారణంగా వైవిని టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవిలో నియమించారు. రెండేళ్ళ కాలపరిమితి ఈనెల 21వ తేదీతో ముగిసిపోయింది. నిజానికి 21వ తేదీలోగానే వైసికి ఎక్స్ టెన్షన్ వస్తుందని అనుకున్నారు. అయితే చాలామంది ఆశించినట్లు పొడిగింపు రాలేదు.

రెండోసారి ఛైర్మన్ గా వైవికి పొడిగింపు రాకపోగా బుధవారం బోర్డు స్ధానంలో స్పెసిఫైడ్ అథారిటిని నియమించింది ప్రభుత్వం. దాంతో వైవీకి రెండోసారి అవకాశంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో పార్టీలో సీనియర్ నేత, మాజీఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఛైర్మన్ పదవి కోసం గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలోనే కొడుకు మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రిపదవి, టీడీపీలో నుండి వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎంపి టికెట్ విషయంలో మేకపాటి పక్కకు తప్పుకున్నారు.

2019 లో ఎన్నికల్లో పోటీనుండి తప్పుకునే సమయంలోనే మేకపాటికి జగన్ టీటీడీ ఛైర్మన్ పదవిని హామీఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఒకే విధమైన హామీని జగన్ ఇద్దరు నేతలకూ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. అయితే మొదటగా వైవికి ఛైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టే ఇపుడు మేకపాటికి ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఛైర్మన్ గా కొత్తవారిని ఎంపిక చేయబోతున్నారు కాబట్టే మొత్తం సభ్యులను కూడా మార్చేయబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఒకవైపు ఛైర్మన్ పదవికోసం మరోవైపు సభ్యుల కోసం జగన్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. నిజానికి ఎవరి ఒత్తిళ్ళకు లొంగేరకం కాదు జగన్. అయినా ఎవరి స్ధాయిలో వాళ్ళు జగన్ పై ఒత్తిడి తేవటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. మరి మొదటిబోర్డులో ఉన్నట్లే సభ్యుల సంఖ్య 30కి పైగా ఉంటుందా లేక పరిమితంగా ఉంటుందా అనేది చూడాలి.