జగన్ ది రహదారి కాదు, రాజారెడ్డి దారి – చంద్రబాబు

ఎల్జీ పాలిమర్స్ కు 1996లో చంద్రబాబే అనుమతులు ఇచ్చారంటూ ఈరోజు మధ్యాహ్నం జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేవరకు తండ్రి దారిలో, ముఖ్యమంత్రి అయ్యాక తాత దారిలో నడుస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

అడ్డొచ్చిన వారిపై అక్రమకేసులు బనాయించి తప్పించుకోవాలని చూస్తున్నారని.. చంద్రబాబు ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీపై ఎదురుదాడికి దిగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సోమవారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్సులో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఎల్జీ పాలిమర్స్ బాధితులతో మాట్లాడారు. ఆ సందర్భంగా చంద్రబాబే ఎల్జీ పాలిమర్స్ కు కారకుడు అన్న విషయం తెలిసిందే. అందుకే చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్టు అర్థమవుతోంది.

కోవిడ్ పై వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కరోనా వైరస్ తెచ్చింది కూడా టీడీపీనే అని ప్రచారం చేయగల సమర్థులని వ్యాఖ్యానించారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం అసమర్థత వల్లే ఏపీలో కరోనా వ్యాప్తి అంత దారుణంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో దిగజారిన పరిస్థితుల నుంచి, తన వైఫ్యలాలు జనాలు చర్చించుకోకుండా చేయడానికి కేసీఆర్ నీటి పంపకాల చర్చను తెరమీదకు తెచ్చారని అన్నారు. కాళేశ్వరానికి పునాది వేసిన రోజు కాళేశ్వరం పూర్తయితే ఆంధ్రా-తెలంగాణ ఇండియా-పాకిస్తాన్ లా మారతాయని వ్యాఖ్యానించి దీక్షకు దిగిన జగన్ స్వయంగా వెళ్లి ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని విమర్శించారు.

తాను తప్పులు చేసి ఎవరూ తనను ఏమీ అనకూడదు అనుకుంటారని, ఇళ్ల పట్టాలు ఇస్తున్నది ప్రజలపై ప్రేమతో కాదని, అది కూడా ఓ స్కాం అన్నారు. అతనికి చట్టాలంటే లెక్క లేదని, ఆ లెక్కలేని తనంతో ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం వల్లే కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చంద్రబాబు అన్నారు.