చంద్ర‌బాబుకు బాధే అయినా.. ఇది ప‌చ్చినిజం..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బాధ క‌లిగించే అంశం ఇది. అయినా.. ఎక్క‌డా ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. పార్టీ నేత‌లు గుర్రు పెట్టి మ‌రీ నిద్ర పోతున్నారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు అన్న నంద‌మూరి తార‌క రామారావు పుట్టిన నియోజ‌క‌వ‌ర్గంలో, తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదం పురుడు పోసుకున్న చోట‌.. ఇప్పుడు ఆ పార్టీ జాడ‌లు క‌నిపించ‌డం లేదు. ఇది ప‌చ్చి నిజం. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ నేత‌లు ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు.

నిజానికి కృష్ణాజిల్లా అంటే.. ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌. అలాంటి జిల్లాలో అన్న‌గారు ఎన్టీఆర్ పుట్టి పెరిగిన ఊరు నిమ్మ‌కూరు. ఇది ఉన్న నియోజ‌క‌వ‌ర్గం పామ‌ర్రు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న త‌ర్వాత దీనిని ఎస్సీ సామాజిక వ‌ర్గానికి కేటాయించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు టీడీపీ అస్తిత్వాన్ని వెతుక్కునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. వ‌రుస ప‌రాజ‌యాల‌తో పార్టీ కుంగిపోతోంది. క‌నీసం జెండా ప‌ట్టుకుని పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేవారు కూడా క‌నిపించ‌డం లేదు.

గ‌త నెల‌లో అన్న‌గారి జ‌యంతి సంద‌ర్భంగా ఇక్క‌డ పార్టీ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేస్తే.. ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా రాలేని ప‌రిస్థితి వ‌చ్చింది. 2009లో కొత్త‌గా ఏర్ప‌డిన ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది. త‌ర్వాత 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించింది. అయితే.. ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అయిన‌ప్ప‌టికీ.. పార్టీని నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేయాల్సిన అవ‌స‌రాన్ని టీడీపీ అధినేత నుంచి నియోజ‌క‌వ‌ర్గం స్థాయి నేత‌ల వ‌ర‌కు ఎవ‌రిలోనూ క‌నిపించ‌డం లేద‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌.

గ‌తంలో అంటే 2009 టీడీపీ నుంచి పోటీ చేసిన ఉప్పులేటి క‌ల్ప‌న ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. వైసీపీలోకి చేరిపోయారు. ఆ త‌ర్వాత 2014లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. మ‌ళ్లీ 2017లో టీడీపీలో చేరారు. ఈమెకే గ‌త 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ ఇచ్చారు. అయితే.. ఆమె విజ‌యం సాధించ‌లేక పోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఇంటి గ‌డ‌ప దాట‌డం లేదనే వాద‌న ఉంది. పార్టీని బ‌లోపేతం చేయ‌డం కానీ, పార్టీ నేత‌ల‌ను స‌మీక‌రించ‌డం కానీ.. క‌ల్ప‌న చేయ‌డం లేదు.

ఇక‌, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామ‌య్య కూడా సైలెంట్ అయిపోయారు. 2014లో వ‌ర్ల రామ‌య్యే ఇక్క‌డ నుంచి పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న రాష్ట్ర రాజ‌కీయాలు చేస్తున్నారే త‌ప్ప‌.. నియోజ‌క‌వ‌ర్గంపై ఎక్క‌డా దృష్టి పెట్ట‌డం లేదు. ఇక‌, క‌ల్ప‌న లోపాయికారీగా వైసీపీ నేత‌ల‌తో ఒప్పందాలు చేసుకున్నార‌నే వాద‌న కూడా ఉంది. ఈ ప‌రిణామాల‌తో ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా టీడీపీ ఇక్క‌డ విజ‌యం సాధించాలంటే.. స‌రైన నాయ‌కుడిని ఇప్ప‌టి నుంచే లైన్‌లో పెట్టాల‌నేది టీడీపీ సానుభూతిప‌రుల మాట‌. కానీ, ఆదిశ‌గా చంద్ర‌బాబు కానీ, ఆయ‌న కుమారుడు లోకేష్ కానీ.. చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో అన్న‌గారు పుట్టిన నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి దిన‌దిన‌గండంగా మారింద‌నేది వాస్త‌వం.