మోడీ ఇప్పుడే జాతిని ఉద్దేశించి ఎందుకు మాట్లాడారో తెలుసా?

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగ‌తి తెలిసిందే. దేశంలోని 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా అందించనున్నట్లు, ఈ నెల 21 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని ప్రధాని మోడీ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్లను సేకరించే బాధ్యత కేంద్రం తీసుకుంటుంద‌ని, వ్యాక్సిన్‌ కేంద్రమే నేరుగా కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇలా గ‌త కొద్దికాలంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌కు ఆయ‌న చెక్ పెట్టేశారు. అయితే, ప్ర‌ధాని ఇప్పుడే ఎందుకు టీవీ ముందుకు వ‌చ్చార‌న్న విష‌యంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

కేంద్ర వ్యాక్సిన్‌ విధానాన్ని మార్చాలని, వ్యాక్సిన్‌ సేకరించి అందరికీ ఉచితంగా అందించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు లేఖ‌లు రాశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పదకొండు బీజేపీ యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి సైతం అదే రీతిలో అన్ని రాష్ట్రాల సీఎంల‌కు లేఖ రాశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీరికి బాసటగా నిలవడం, సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం, ఇది కేంద్ర- రాష్ట్రాల మధ్య వివాదంగా మారడం వంటి పరిణామాల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం టీకాల విష‌యంలో తన విధానాన్ని మార్చుకోక తప్పలేదు.

తాజాగా ప్ర‌ధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ, దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, 25 శాతం ప్రయివేటు ఆస్పత్రులు కొనుక్కోవచ్చని ఆయన తెలిపారు. ఈ నెల 21 నుంచి ఉచిత టీకా ప్రక్రియ చేపట్టి నవంబర్‌ నాటికి 80 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామన్నారు. సొంత ఖర్చుతో టీకా వేసుకోవాలనుకునేవారికి ప్రైవేటులో అవకాశం ఉంటుందని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు ఒక్కో డోసుకు సర్వీస్‌ ఛార్జి గరిష్టంగా రూ.150 దాకా వసూలు చేసుకోవచ్చన్నారు. ఇంతమంది జనాభా ఉన్న దేశంలో వ్యాక్సిన్‌ తయారు చేసుకోకుంటే పరిస్థితి ఏమిటి? మనం వ్యాక్సిన్‌ తయారు చేసుకోకపోతే విదేశాల నుంచి వచ్చేందుకు ఏళ్లు పట్టేదని పేర్కొన్నారు.

అయితే, ప్ర‌ధాని ఇప్పుడు జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌డం వెనుక రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ విధానానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున నిరసనలు, సుప్రీం కోర్టు నుంచి విమర్శలు రావడంతో మోడీ ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఈ విష‌యంలో ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌ట‌న చేయాల్సి వ‌చ్చిందంటున్నారు. మ‌రోవైపు కోవిడ్ సెకండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డం, రోజువారి కేసుల్లో భారీ క్షీణ‌త వ‌ల్ల ప్ర‌జ‌ల ఆందోళ‌న‌లు త‌గ్గిన త‌రుణంలో ఆయ‌న ప్ర‌సంగించార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.