ఆయన మాటతో మోడీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారా?



మెత్తటి మాటలు చెప్పే మోడీ మహా కటువుగా ఉంటారన్న విషయం తెలిసిందే. చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పోలిక లేకుండా చేసే తీరు ఆయనలో ఎక్కువనే చెప్పాలి. అనుకోని రీతిలో విరుచుకుపడిన విపత్తు వేళ.. వెంటనే స్పందించినట్లు కనిపించే మోడీ మాష్టారు.. సదరు రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో పెట్టే కోత.. గీసి.. గీసి నిధుల్ని విడుదల చేసే తీరుకు ఒళ్లు మండిపోవటం ఖాయం. కొన్ని సందర్భాల్లో అదే పనిగా ఏం అడుగుతామన్న భావన రాష్ట్రాలకు కలిగేలా చేసే టాలెంట్ ఆయనలో ఎక్కువనే చెబుతారు.


గత ప్రధానులతో పోలిస్తే.. విలక్షణమైన తత్త్వం ఆయన సొంతమని చెబుతారు. ఆయనకు సన్నిహితంగా ఉన్న వారు సైతం ఆయన స్పందించే తీరుకు ఆశ్చర్యానికి గురవుతారని చెబుతారు. ఇక.. కీలక స్థానాల్లో నియమకాలకు సంబంధించి ఆయన ఎంపిక భిన్నంగా ఉంటుందని చెబుతారు. తాను ఎవరినైతే డిసైడ్ అవుతారో.. తన సన్నిహితులతో షేర్ చేసుకునేది తక్కువనే చెబుతారు. అలాంటి తీరున్న మోడీ నిర్ణయాన్ని మార్చటంలో తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక భూమిక పోషించారని చెబుతారు.


తాజాగా సీబీఐ చీఫ్ ను ఎంపిక చేసే కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ.. సుప్రీంకోర్టు చీప్ జస్టిస్.. ప్రతిపక్ష నేతతో కూడిన టీం షార్ట్ లిస్టు చేస్తుంది. సీబీఐ బాస్ రేసులో దాదాపు వందకు పైగా పేర్లు పరిగణలోకి వచ్చినట్లుగా చెబుతారు. అయితే.. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ టీం దాదాపుగా గంటన్నర పాటు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి మోడీ ప్రభుత్వ ఛాయిస్ వేరుగా ఉందని చెబుతారు.


కీలకమైన వేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎన్వీ రమణ.. లేవెనెత్తిన ఒక పాయింట్ ప్రధాని మోడీ నిర్ణయంపై ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతారు. అదేమంటే.. సీబీఐ పదవికి ఎంపిక చేసే వారు కనీసం ఆర్నెల్లకు పైనే చేయాల్సి ఉంటుంది. కానీ.. మోడీ సర్కారు షార్ట్ లిస్టులో ఇద్దరు పేర్లు ఉన్నాయి. వారంతా కూడా ఆగస్టు 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. దీంతో.. కచ్ఛితంగా ఆర్నెల్లు పదవిలో ఉండాలన్న నిబంధనను సమావేశంలో ప్రధాని మోడీకి సుప్రీం చీఫ్ జస్టిస్ గుర్తు చేశారని చెబుతున్నారు. ఆర్నెల్ల కంటే పదవీ కాలం ఉన్న వారి పేర్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చెప్పటంతో పాటు.. అందుకు సంబంధించిన రూల్ పొజిషన్ ను కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.


ఈ కారణంగానే చివర్లో షార్ట్ లిస్టు అయిన రాకేష్ ఆస్థానా.. (ఆగస్టు 31న పదవీ విరమణ).. వైసీ మోడీ(మే 31న పదవీ విరమణ) చేయాల్సిన ఇద్దరిని రేసు నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది. నిజానికి సీబీఐ చీఫ్ కోసం 109 మంది పేర్లు అందాయని.. సమావేశంలో కూర్చునే సమయానికి ఆరు పేర్లు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. సీబీఐ చీఫ్ ఎంపిక సాదాసీదాగా ఉన్నట్లుగా విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా.. మోడీ ఛాయిస్ వేరే ఉందని.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారని చెబుతున్నారు.