మూడో వేవ్ లో అన్నా జాగ్రత్త పడుతుందా ?

సెకెండ్ వేవ్ కరోనా వైరస్ తీవ్రతను సమర్ధవంతంగా ఎదుర్కోవటంలో కేంద్రంతో పాటు రాష్ట్రప్రభుత్వం విఫలమైంది. అన్నీ రాష్ట్రప్రభుత్వాలు విఫలమైనట్లే ఏపి కూడా ఫెయిలైందని సమర్ధించుకుంటే సరిపోదు. ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ కిందే పరిగణించాలి. సరే జరిగిందేదో జరిగిపోయిందని అనుకుంటే కనీసం థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకైనా ముందునుండే రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.

తొందరలోనే థర్డ్ వేవ్ తీవ్రంగా విరుచుకుపడబోతోందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఎప్పటినుండో హెచ్చరిస్తున్నారు. సెకెండ్ వేవే ఇంత భయకరంగా ఉంటే ఇక థర్డ్ వేవ్ తీవ్రత ఇంకెలాగుంటుందో ఊహించేందుకే భయంగా ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇప్పటినుండే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ముందజాగ్రత్తలు మొదలుపెట్టేశాయి.

పిల్లలమీద కరోనా వైరస్ తీవ్రత పడకూడదంటు ఇప్పటినుండే పీడియాట్రిక్స్ ఆసుపత్రులను, వార్డులను రెడీ చేసుకోవాలి. పీడియాట్రిక్స్ నిపుణులతో ఓ కమిటి వేసి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై సలహాలు తీసుకోవాలి. వాళ్ళ సూచనల ప్రకారం అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి. ప్రతి జిల్లాలోను అవకాశం ఉంటే పెద్ద పట్టాణాల్లో కూడా పిల్లల కోసమే ప్రత్యేక ఆసుపత్రులను రెడీచేయాలి. ఇప్పటికే ఉన్న ఆసుపత్రుల్లోనే పిల్లల కోసం ఏర్పాట్లు చేయాలి.

పిల్లల వైద్య నిపుణులతో రెగ్యులర్ గా టచ్ లో ఉండటంతో పాటు అవసరమైన నిపుణులను ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి. ప్రైవేటు డాక్టర్లను కూడా పిల్లల వైద్య అవసరాల కోసం ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. ఈ మేరకు ముందుగానే డాక్టర్ల అసోసియేషన్లతో సమావేశమవ్వాలి. అందుకు డాక్టర్లకు అవసరమైన సౌకర్యాలను అన్నీ ఆసుపత్రులు, వార్డుల్లో ఏర్పాట్లు చేయాలి.

ఆక్సిజన్ ప్లాంట్లను రెడీ చేసుకోవటమే కాకుండా ప్రత్యామ్నాయాలను కూడా సిద్ధం చేసుకోవాలి. అన్నీ రాష్ట్రాలు రెడీ అవుతున్న పద్దతులేంటో తెలుసుకుని జగన్ సర్కార్ కూడా అందుకు సిద్ధంగా ఉండాలి.