వూహ్యాత్మకం.. బాబు మౌనం

గడిచిన కొద్ది కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి పంచాయితీలు లేవు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అంతా బాగుందనుకుంటున్న వేళ.. అనూహ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెర మీదకు తీసుకొచ్చిన సీమ ఎత్తిపోతల పథకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పథకానికి పచ్చజెండా ఊపుతూ ఏపీ సర్కారు జీవో జారీ చేసింది.

సమాచారం లేకనో.. ఇంకేదైనా కారణమో కానీ.. జీవో విడుదలైన తర్వాత కాస్త మౌనంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్న వేళ.. ప్రమాదాన్ని పసిగట్టిన కేసీఆర్ తనదైన శైలిలో గొంతు సవరించుకున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం మౌనంగా ఉన్నారు. ఏపీ ప్రయోజనాల గురించి మాట్లాడరేమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కవ్వించినా బ్యాలెన్స్ మిస్ కాలేదు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్న బాబు.. ఎత్తిపోతల పథకం గురించి మాట వరసకు ప్రస్తావించకపోవటం ఆసక్తికరంగా మారింది. మైకు కనిపిస్తే చాలు అదే పనిగా మాట్లాడతారన్న విమర్శతో పాటు.. అవసరం ఉన్నా లేకున్నా చాలా విషయాల్లో తనకు తానుగా కెలుక్కుంటారన్న చెడ్డపేరు ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తుంటారు.

తన తీరుకు భిన్నంగా.. ఎత్తిపోతల పథకంపై వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శిస్తున్నారు బాబు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న తరహాలో.. ఇప్పటికే పలుమార్లు రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని ప్రయత్నించిన ప్రతిసారీ విమర్శలు ఎదుర్కొన్న వేళ.. జరిగేది చూస్తూ ఉందామన్నట్లుగా బాబు ఉన్నట్లు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు అన్న బాబును ఎంతలా ఎద్దేవా చేశారో తెలిసిందే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో విమర్శించారనో.. మరో కారణంతోనో తన నోటి నుంచి వచ్చే మాటలతో తనను అడ్డు పెట్టుకొని విపరీత వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందన్న ఆలోచనతోనే బాబు కామ్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. తన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.. ఇదే తీరును ఎంతకాలం కొనసాగిస్తారన్నది కాలమే సరైన సమాధానం చెప్పగలదు.