వెల్కమ్ గోవా అన్నారు.. ఏమైందో చూడండి

దేశంలో కరోనా ప్రభావం అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గోవా ఒకటి. పొరుగునే ఉన్న మహారాష్ట్రలో వేలల్లో కేసులు, వందల్లో మరణాలు నమోదవుతుంటే.. గోవాలో మాత్రం రెండు నెలల వ్యవధిలో నమోదైన కేసులు కేవలం 7 మాత్రమే. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి అక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం.. రాష్ట్ర సరిహద్దులను మూసేయడం, టూరిస్టు కార్యకలాపాలన్నీ ఆపేయడంతో కరోనా వ్యాప్తిని సమర్థంగా నియంత్రించినట్లయింది.

గత నెల రోజుల్లో అక్కడ ఒక్కటంటే ఒక్క కేసు కూడా లేదు. గోవాను కరోనా ఫ్రీ స్టేట్‌గా ప్రకటించుకున్నారు. ఇక ఇబ్బందేమీ లేదు అన్నట్లుగా గోవాలో నెమ్మదిగా మళ్లీ పర్యాటకుల్ని అనుమతించడం మొదలుపెట్టారు. వెల్కం టు గోవా అంటూ ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. కానీ అదే దెబ్బ కొట్టింది.

గోవాకు మళ్లీ టూరిస్టులను అనుమతించిన కొన్ని రోజులకే కరోనా ప్రభావం మొదలైంది. ఒక్క రోజు వ్యవధిలో అక్కడ ఏడు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా వ్యాప్తి పతాక స్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా రోజుకు 4 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో గోవాలో నిబంధనలు సడలించి తిరిగి టూరిస్టులను అనుమతించడం గట్టి దెబ్బ తీసింది.

ఒకే రోజు ఏడు కేసులు బయటపడ్డాయంటే మున్ముందు మరిన్ని కేసులు వెలుగులోకి రావడం ఖాయం. ప్రతి రాష్ట్రంలోనూ ఇలా ఒకటి, రెండు, ఐదు, పది కేసులతో మొదలై ఇప్పుడు వందలు, వేలమంది కరోనా బారిన పడి అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గోవా లాంటి పర్యాటక ప్రాంతం అప్రమత్తం కాకపోతే తీవ్ర పరిణామాలు చూడక తప్పదు.