ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో జగన్ కీలక నిర్ణయం ?

రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుప్రతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా ? అంటే అవుననే సమాచారం. కోవిడ్ చికిత్సలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీనివల్ల కోవిడ్ చికిత్సలు, రోగుల వివరాలు, ఫీజుల వసూళ్ళు తదితరాలపై పారదర్శకత వస్తుందని ప్రభుత్వానికి హైకోర్టు గట్టిగా చెప్పింది.

హైకోర్టు ఆదేశాల ప్రకారం చూస్తే తొందరలోనే ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఉత్తర్వులు, గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన విషయం తెలిసిందే. కరోనా చికిత్సల విషయంలో రోగులను ప్రైవేటు ఆసుపత్రులు దోపిడి చేస్తున్నాయనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. అసలు మందేలేని కరోనా వైరస్ కు చికిత్సల పేరుతో చాలామంది నుండి రు. 20 లక్షలు, 30 లక్షలు కూడా వసూలు చేసిన, చేస్తున్న ఆసుపత్రులున్నాయి.

రాష్ట్రంలో ఎన్ని ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ చికిత్సను అందిస్తున్నాయో కూడా ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవన్న విషయం బయటపడింది. ఎందుకంటే కోవిడ్ రోగులకు చికిత్సల విషయంలో ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకోకుండానే వైద్యం చేసేస్తున్నారు. అనుమానం వచ్చో లేకపోతే ఆరోపణలు వచ్చినపుడు విజిలెన్సు అధికారులు దాడులు చేసినపుడు అసలు విషయం బయటపడుతోంది. తాజాగా హైకోర్టు సూచనలతో ఇలాంటి అనేక సమస్యలకు చెక్ పడినట్లవుతుంది.

ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తే చేరుతున్న రోగులు, చికిత్సలు చేయించుకుంటున్న రోగులు, డిస్చార్జవుతున్న రోగులు, ఆక్సిజన్ అవసరాలు, వసూలు చేస్తున్న ఫీజులు స్ట్రీమ్ లైనవుతుంది. మొత్తంమీద ప్రైవేటు ఆసుపత్రుల చికిత్స, వసూలు చేస్తున్న ఫీజుల విషయంలో జనాల్లో చాలా గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. హైకోర్టు సూచనను ప్రభుత్వం గనుక అమల్లోకి తెస్తే చాలా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి.