వైకాపా ఎంపీ కోసం చంద్ర‌బాబు హ్యాష్ ట్యాగ్‌


తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడాది కింద‌ట్నుంచి తీవ్ర‌ విమ‌ర్శ‌లు చేస్తూ మీడియాలో బాగా హైలైట్ అవుతూ వ‌చ్చారు న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు. రెబ‌ల్‌గా మారిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఇంకా పార్టీలోనే కొన‌సాగుతున్నారు. ఆయ‌న‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల్లాంటివేమీ చేప‌ట్ట‌లేదు. అన‌ర్హ‌త వేటూ ప‌డ‌లేదు. ఇప్ప‌టికీ ఆయ‌న వైకాపా నాయ‌కుడే.

సాంకేతికంగా వైకాపా ఎంపీ అయిన ర‌ఘురామ‌కృష్ణంరాజు కోసం ఇప్పుడు తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ట్విట్ట‌ర్లో హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్‌కు శ్రీకారం చుట్ట‌డం విశేషం. ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ తీసే వ్యాఖ్య‌లు చేశారంటూ ప‌లు సెక్ష‌న్ల కింద రఘురామ మీద‌ కేసులు పెట్టిన ఏపీ సీఐడీ పోలీసులు.. ఆయ‌న్ని శుక్ర‌వారం ఆరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. అంత‌టితో ఆగ‌కుండా త‌మ క‌స్ట‌డీలో ర‌ఘురామ‌ను పోలీసులు కొట్టిన‌ట్లు కూడా వార్త‌లొస్తున్నాయి. ఈ మేర‌కు ర‌ఘురామ గాయాల‌తో ఉన్న ఫొటోలు కూడా మీడియాలోకి వ‌చ్చాయి. దీంతో ఈ వ్య‌వ‌హారం సామాజిక మాధ్య‌మాల్లో హాట్ టాపిక్ అయింది.

ర‌ఘురామ త‌మ పార్టీ నాయ‌కుడు కాక‌పోయిన‌ప్ప‌టికీ.. త‌మను మించి జ‌గ‌న్ మీద పోరాడుతుండ‌టంతో ఆయ‌న్ని టీడీపీ ఓన్ చేసుకుంటోంది. స్వ‌యంగా టీడీపీ అధినేత ర‌ఘురామ అరెస్టును, ఆయ‌న‌పై దాడిని ఖండిస్తూ ట్విట్ట‌ర్లో పోస్టు పెట్టారు. అలాగే #WesupportRRR #WestandwithRRR అంటూ చంద్ర‌బాబు హ్యాష్ ట్యాగ్స్ కూడా జోడించ‌డం విశేషం. ఆయ‌న ఇలా ట్వీట్ వేయ‌గానే.. టీడీపీ సోష‌ల్ మీడియా హ్యాండిల్స్, పార్టీ మ‌ద్ద‌తుదారుల‌తో పాటు ర‌ఘురామ స‌పోర్ట‌ర్స్ కూడా ట్రెండ్‌ను అందిపుచ్చుకున్నారు. ఈ రెండు హ్యాష్ ట్యాగ్స్ నేష‌న‌ల్ లెవెల్లో ట్రెండ్ అయ్యాయి. వ్య‌వ‌హారం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చూస్తుంటే ర‌ఘురామ అరెస్టు, ఆయ‌న‌పై దాడి జ‌గ‌న్ స‌ర్కారుకు త‌ల‌నొప్పి తెచ్చిపెట్టేలాగే ఉంది.