పరీక్షలు లేవు.. పదో తరగతి విద్యార్థులందరూ పాస్

స్కూళ్లలో ఇంతకుముందు ఏడో తరగతికి పబ్లిక్ పరీక్షలుండేవి. వాటిలో పాసైతేనే తర్వాతి తరగతికి ప్రమోట్ చేసేవాళ్లు. ఐతే చాలామంది అక్కడితో చదువు ఆపేస్తున్నారని ఏడో తరగతికి పబ్లిక్ పరీక్షలు ఆపేశారు. ఇప్పుడు స్కూల్ స్థాయిలో పదో తరగతికి మాత్రమే పబ్లిక్ పరీక్షలున్నాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాల్సిందే. ఇంటర్లో చేరాలంటే ఈ పరీక్షల్లో పాసవ్వాల్సిందే. కానీ కరోనా వైరస్ ధాటికి ఈ ఏడాది దేశంలో ఎక్కడా పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి అవకాశం లేకపోయింది.

మార్చి ద్వితీయార్ధం నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా సరిగ్గా అప్పుడే లాక్ డౌన్ మొదలైంది. కొన్ని రాష్ట్రాల్లో రెండు మూడు పరీక్షలు నిర్వహించి బ్రేక్ వేశారు. చాలా రాష్ట్రాల్లో అసలు ఒక్క పరీక్ష కూడా మొదలు కాలేదు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా.. పరీక్షలు ఎప్పుడు మొదలుపెడదామా అని చూస్తున్నారు.

కానీ లాక్ డౌన్‌ను నాలుగోసారి కూడా పొడిగించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తుండటం.. రాష్ట్రాలు కూడా పొడిగింపుకే మొగ్గు చూపుతుండటంతో పరీక్షల నిర్వహణ కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచాం. ఈ ఏడాదికి పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ తర్వాతి తరగతికి ప్రమోట్ చేయాలని నిర్ణయించిందట.

పరీక్షలు, ఆ తర్వాత ఫలితాల కోసం నెల రోజుల సమయం పడుతుంది. మే నెలలో అయితే పరీక్షలకు అవకాశమే లేదు. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో జూన్‌లో కూడా పరిస్థితి మారుతుందా అన్నది సందేహమే. మరీ ఆలస్యమైతే వచ్చే విద్యా సంవత్సరానికి ఇబ్బంది.

దీంతో పదో తరగతి పరీక్షలు రద్దు చేయడమే మేలని ఛత్తీస్ గఢ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే మొత్తం అందరినీ ప్రమోట్ చేయకుండా ఇది వరకు రాసిన క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రి ఫైనల్ పరీక్షల ఫలితాల్ని ప్రామాణికంగా తీసుకుని కొందరు విద్యార్థులకు బ్రేక్ వేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.