తెలంగాణా పోలీసులు మరీ ఇంత దారుణమా ?

కరోనా వైరస్ రోగుల విషయంలో తెలంగాణా పోలీసులు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. కరోనా చికిత్స కోసం ఏపిలోని అనేక ప్రాంతాల నుండి హైదరాబాద్ కు అంబులెన్సుల్లో వస్తున్నవారిని సోమవారం ఉదయం నుండి రాష్ట్రాల సరిహద్దుల్లోని చెక్ పోస్టుల దగ్గర నిలిపేస్తున్నారు. అంబులెన్సుల్లో వెంటిలేటర్లపై ఉన్న రోగులను కూడా తెలంగాణాలోకి అడుగుపెట్టనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

హైదరాబాద్ లోని ఆసుపత్రుల్లో సదరు రోగిని చేర్చుకుంటున్నట్లు ధృవపత్రాన్ని చూపించిన రోగులను మాత్రమే పోలీసులు అనుమతించటం వివాదాస్పదమైంది. రోజువారి అత్యవసర వైద్యం కోసం ఏపితో పాటు కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ నుండి వందల సంఖ్యలో రోగులు హైదరాబాద్ కు వస్తుంటారు. ఇదే పద్దతిలో పై ప్రాంతాల నుండి కరోనా రోగులు ఏపిలోని అనేక జిల్లాల నుండి హైదరాబాద్ బయలుదేరారు.

అయితే సరిహద్దుల దగ్గర రోగులున్న అంబులెన్సులను పోలీసులు నిలిపేయటంతో సమస్య పెరిగిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపి నుండి ఏ అవసరాల కోసం వస్తున్న వాళ్ళనైనా పోలీసులు అడ్డుకునేందుకు లేదు. ఎందుకంటే పదేళ్ళు తెలంగాణా+ఏపికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం అందరికీ తెలిసిందే. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానికి రానీయకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు లేదు.

ఇప్పటివరకు కరోనా సమస్య విషయంలో ఏపి వెల్లడిస్తున్న లెక్కలతో పోల్చుకుంటే తెలంగాణా ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలతో చాలామందికి అనుమానాలున్నాయి. వాస్తవ లెక్కలకన్నా చాలా తక్కువ కేసులను ప్రభుత్వం చూపిస్తోందనే ఆరోపణలను తెలంగాణా ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఏపి నుండి రోగులను హైదరాబాద్ కు అనుమతిస్తే తమకు మరింత సమస్య పెరిగిపోతుందని తెలంగాణ ప్రభుత్వం భావించినట్లుంది.

ఇదే సమయంలో తెలంగాణాలో కూడా సమస్య రోజురోజుకు పెరిగిపోతున్న కారణంగా ఇక్కడి రోగులకు వైద్యసదుపాయాలు అందించటం కష్టమని కూడా అనుకున్నట్లుంది. ఎందుకంటే తెలంగాణాలో కూడా టీకాలు, ఆక్సిజన్ కు కొరత పెరిగిపోతోంది. అందుకనే ఏపి నుండి వచ్చే రోగులను అడ్డుకుంటున్నది.