అడ్రస్ లేని బీజేపీ నేతలు

ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత పెరిగిపోతున్న సమయంలో బీజేపీ నేతలు ఎక్కడా అడ్రస్ కనబడటం లేదు. కరోనా సంక్షోభంలో జనాలకు అందుబాటులో ఉండి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి అందాల్సిన సాయానికి ఒక్క ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ఎక్కడ కనబడటంలేదు. ఒకవైపు ఆక్సిజన్ కొరత పట్టి పీడిస్తోంది. మరోవైపు టీకాలు రావాల్సినంత రావటంలేదు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల ముందు చేంతాడంత క్యూలు పెరిగిపోతున్నాయి.

ఆసుపత్రులు, బెడ్లు, వైద్య సాయం కూడా అందాల్సినంతగా అందటం లేదన్నది వాస్తవం. అయితే ఇలాంటి సమయంలో కేంద్రం నుండి రాష్ట్రానికి ఆక్సిజన్ అయినా టీకాలనైనా తెప్పించటంలో రాష్ట్రంలోని నేతలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నదే అర్ధం కావటం లేదు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల సమయంలో కేంద్రం నుండి అది తెప్పిస్తామని, ఇది తెప్పిస్తామని బోలెడు హామీలిచ్చారు. సరే ఎన్ని హామీలిచ్చినా కనీసం డిపాజిట్ కూడా రాలేదులేండి.

రేపటిరోజునైనా జనాల ఆదరణ పొందాలంటే టీకాలు, ఆక్సిజన్ తెప్పించవచ్చు. మహారాష్ట్రలో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్రంతో మాట్లాడి రెమ్ డెసివిర్ టీకాలను తెప్పించినట్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఫడ్నవీస్ తెప్పించినట్లే ఏపికి కూడా టీకాలు, ఆక్సిజన్ను బీజేపీ నేతలు తెప్పించచ్చు కదా ?

పైగా బీజేపీ రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి+జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంటి వాళ్ళకు ఢిల్లీలోని పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయని ప్రచారం అందరికీ తెలిసిందే. మరి తమకున్న పరిచయాలను జనాల కోసం ఎందుకు ఉపయోగించకూడదు ? ఇపుడు కూడా జనాల కోసం కమలనాదులు పనిచేయకపోతే ఇక ముందేమి చేస్తారు ?