వామన్ రావు హత్య కేసులో ఈటల బుక్కైనట్టేనా?

Eetela Rajendra

ఈట‌ల రాజేంద‌ర్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ గా వినిపిస్తున్న పేరు. టీఆర్ఎస్ నేత‌గా, తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఈట‌ల‌… ఒక్క‌సారిగా కేసీఆర్ ఆగ్ర‌హానికి గురైపోయారు. దేవ‌ర‌యాంజ‌ల్ భూముల కేసులో ఇప్ప‌టికే బుక్కైపోయిన ఈట‌ల‌పై మ‌రో కీల‌క కేసు న‌మోదు కానుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేకెత్తించిన న్యాయ‌వాది వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య కేసులో ఇప్పుడు ఈట‌ల పేరు కూడా నిందితుల జాబితాలో చేరిపోయేందుకు దాదాపుగా రంగం సిద్ధం అయిపోయింద‌నే చెప్పాలి. శ‌నివారం వ‌రుస‌గా చోటుచేసుకున్న ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే… ఈ విష‌యం బోధ‌ప‌డుతోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే… వామ‌న్ రావు దంప‌తుల‌పై దాడి చేసిన కొంద‌రు దుండ‌గులు వారిద్ద‌రినీ అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ పుట్ట మ‌ధు సూత్ర‌ధారి అని, త‌న‌ను అన‌వ‌స‌ర‌మైన కేసుల‌తో వేధిస్తున్నార‌న్న భావ‌న‌తో వామ‌న్ రావును పుట్ట మ‌ధు హ‌త్య చేయించార‌న్న‌ది కీల‌క ఆరోప‌ణ‌. ఈ కేసులో ఓ ద‌ఫా పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన మ‌ధు,… ఆ త‌ర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే వారం పాటు మ‌ధు కోసం అంత‌గా ప‌ట్టింపు లేన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన తెలంగాణ పోలీసులు గ‌డ‌చిన రెండు, మూడు రోజులుగా కాస్తంత గ‌ట్టి నిఘానే పెట్టారు. ఈ క్ర‌మంలో ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో త‌ల‌దాచుకున్న పుట్ట మ‌ధును ఎట్ట‌కేల‌కు ప‌ట్టేశారు. భీమ‌వ‌రం నుంచి మ‌ధును హైద‌రాబాద్ త‌ర‌లించిన పోలీసులు ఆయ‌న‌ను త‌మ‌దైన శైలిలో విచారిస్తున్న‌ట్లుగా స‌మాచారం.

ఇదిలా ఉంటే.. పుట్ట మ‌ధు పోలీసుల‌కు చిక్కిన రోజే వామ‌న్ రావు తండ్రి కిష‌న్ రావు మీడియా ముందుకు వ‌చ్చి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న కొడుకు, కోడ‌లుపై దాడి జ‌రిగిన త‌ర్వాత వారిద్ద‌రినీ స‌కాలంలోనే ఆసుప‌త్రికి త‌ర‌లించినా… ఆసుప‌త్రిలో స‌కాలంలో వారికి వైద్యం అంద‌లేద‌ని, ఇందుకు నాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈట‌ల రాజేంద‌రే కార‌ణ‌మ‌ని కూడా కిష‌న్ రావు ఆరోపిస్తున్నారు. ఈట‌ల ఆదేశాల‌తోనే వైద్యులు త‌న కొడుకు, కోడ‌లుకు వైద్యం అందించ‌లేద‌ని, దీంతో దాడికి గురైన వారిద్ద‌రూ చ‌నిపోయార‌ని ఆయ‌న ఆరోపించారు. మొత్తంగా వామ‌న్ రావు దంప‌తుల హ‌త్యోదంతంలో ఈట‌ల పేరును కిష‌న్ రావు చేర్చేశారు. ఇలా శ‌నివారం వ‌రుస‌గా చోటుచేసుకున్న ప‌రిణామాలు బ‌ట్టి చూస్తే… ఇప్ప‌టికే కేసీఆర్ ఆగ్ర‌హానికి గురై కేబినెట్ నుంచి ఉద్వాస‌న‌కు గురైన ఈట‌ల‌పై వామ‌న్ రావు దంపతుల హ‌త్య కేసు కూడా న‌మోదు కానుంద‌న్న వాద‌న‌లు బ‌ల‌ప‌డుతున్నాయి.