తిరుపతిపై పెరిగిపోతున్న టెన్షన్

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల పోలింగ్ తర్వాత వైసీపీలో టెన్షన్ పెరిగిపోతోంది. మిగిలిన ఆరు నియోజకవర్గాలతో పోల్చితే తిరుపతిలో చాలా తక్కువగా పోలింగ్ జరిగింది. మిగిలిన చోట్ల సగటున 70 శాతం పోలింగ్ జరిగిత తిరుపతిలో మాత్రం 50 శాతమే పోలింగ్ నమోదైంది. ఇంత తక్కువ పోలింగ్ గతంలో ఎప్పుడు జరగలేదు. మామూలుగానే ఓవరాల్ గా పోలింగ్ తగ్గిపోవటం ఒక ఎత్తైతే తిరుపతిలో మరీ దారుణంగా పడిపోవటం మరో ఎత్తుగా కనబడుతోంది.

మరి తగ్గిపోయిన పోలింగ్ దేనికి సంకేతమో అర్ధంకావటంలేదు. మొన్నటి ఎన్నికల్లో కూడా తిరుపతిలో వైసీపీకి ఎంపి పోలింగ్ విషయంలో మైనస్ వచ్చింది. అసెంబ్లీ అభ్యర్ధి భూమన కరుణాకర్ రెడ్డి అతికష్టం మీద 700 ఓట్లతో బయటపడ్డారు. అదే పార్లమెంటుకు వచ్చేసరికి వైసీపీ అభ్యర్ధికి 3580 ఓట్లు మైనస్ వచ్చింది. దీంతో క్రాస్ ఓటింగ్ జరిగిన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది.

అయితే ప్రస్తుత విషయానికి వస్తే కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉపఎన్నిక జరిగింది కాబట్టి భూమన సత్తా ఏమిటో తేలిపోతుంది. అందుకనే తిరుపతిలో మెజారిటి తీసుకురావటానికి భూమన+కొడుకు అభినయరెడ్డి బాగా కష్టపడ్డారు. సరే వీళ్ళంతె కష్టపడినా తిరుపతిలో ఓటింగ్ మాత్రం అత్యల్పంగా నమోదైంది. అయితే నమోదైన ఓటింగ్ లోనే వైసీపీకి ఎన్నిపడ్డాయన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు.

ఇదే పరిస్ధితి టీడీపీలో కూడా కనబడుతోంది. పోలింగ్ శాతం బాగా తగ్గిపోవటంతో ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో అర్ధం కావటంలేదు. మొదటినుండి కూడా మిగిలిన నియోజకవర్గాలను వదిలేసి చంద్రబాబునాయుడు అండ్ కో తిరుపతి మీదే ఎక్కువగా దృష్టిపెట్టారు. మిగిలిన ఆరు నియోజకవర్గాలతో పోల్చితే తిరుపతిలోనే కొద్దో గొప్పో నాయకత్వం బలంగా ఉంది. దానికితోడు మొన్నటి ఎన్నికల్లో మెజారిటి రావటంతో దాన్ని నిలబెట్టుకోవాలని టీడీపీ బాగా కష్టపడింది. అందుకనే తాజా పోలింగ్ శాతం కారణంగా రెండుపార్టీల్లోను ఇపుడు టెన్షన్ పెరిగిపోతోంది.