శపథం చేస్తున్నా.. తెలంగాణకు ఏదో ఒక రోజు సీఎం అవుతా

వైఎస్ కుమార్తె.. తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. యువతకు ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయని ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమె.. ఇందిరా పార్కు వద్ద ధర్నా చేయటం తెలిసిందే. గురువారం ఉదయం మొదలైన ఆమె ధర్నా.. సాయంత్రం వరకు సాగటం.. తర్వాత చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఆమె.. లోటస్ పాండ్ వద్ద నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు.

రోడ్డు మీద తాను నడుస్తూ.. పాదయాత్ర చేస్తుంటే.. అనుమతి లేదని పోలీసులు అదుపులోకి తీసుకోవటం దుర్మార్గంగా అభివర్ణించారు. రోడ్డు మీద నడవకూడదా? అలా ముందే చెప్పారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అయితే సభ పెట్టుకోవచ్చని.. అందుకు అనుమతి ఇస్తారని.. వేరే వాళ్లకు మాత్రం ఇవ్వరా? అని నిలదీశారు. లోటస్ పాండ్ వద్ద చిరిగిన దుస్తులతో.. చేతికి అయిన గాయంతో ఆమె నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా ఒక చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను శపథం చేస్తున్నానని.. తాను ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని పేర్కొన్నారు. ‘నన్ను అవమానించిన వారి సంగతి చూస్తా. కేసీఆర్ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? కూడే తింటున్నారా? ఒక ఆడబిడ్డ పొద్దున్నుంచి తినలేదు. యువత ఉద్యోగాలు లేవని ఆత్మహత్య చేసుకుంటున్నారని పోరాడితే.. పీకి పారేస్తారా? గుండె లేదా? రోడ్డు మీద నడవటానికి పర్మిషన్ కావాలా? పర్మిషన్ తీసుకోవాలని చెప్పారా? రోడ్డు మీద నడిస్తే మీ సొమ్మేం పోయింది? మీ ప్రభుత్వాన్ని కూల్చటానికి వస్తున్నామని చెప్పామా? మీ గడీ కూల్చటానికి వస్తున్నామని చెప్పామా? చెప్పలేదు కదా? మీ ప్రాణాలకు ముప్పు లేదు కదా? ఎందుకు పీకి పారేశారు? పొగరా? మదమా? డబ్బు ఉందనా? పదవి ఉందనా? అధికారం ఉందనా?” అని తీవ్రంగా మండిపడ్డారు. ఊహించని రీతిలో షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.