జ‌గ‌న్ మెడ‌కు టికెట్ల గొడ‌వ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని థియేట‌ర్ల‌లో టికెట్ల ధ‌ర‌ల‌పై ఉన్న‌ట్లుండి నియంత్ర‌ణ తీసుకురావ‌డం కొన్ని రోజులుగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. వేరే స‌మ‌యంలో ఈ ప‌ని చేసి ఉంటే దాని మీద వివాదం న‌డిచేది కాదు కానీ.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌కీల్ సాబ్ రిలీజైన‌పుడు ప‌ట్టుబ‌ట్టి ధ‌ర‌ల‌పై నియంత్ర‌ణ తీసుకురావ‌డం, థియేట‌ర్ల ‌మీద దాడులు చేయడం, టికెట్ల ధ‌ర‌ల‌పై చాలా ఏళ్ల కింద‌టి జీవోను ఇప్పుడు రిలీజ్ చేయ‌డంతో గొడ‌వ రాజుకుంది.

ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా కూడా దుమారం రేపింది. ఇష్టానుసారం టికెట్ల రేట్లు పెంచుకుంటుంటే నియంత్రించ‌డం తప్పా అని అధికార పార్టీ నాయ‌కులు ప్ర‌శ్నించ‌డం బాగానే ఉంది. కానీ ఇంత‌కుముందు రిలీజైన సినిమాల విష‌యంలో ఏం చేస్తున్నార‌న్నది ప్ర‌శ్న‌. అధికారికంగానే వాటికి టికెట్ల రేట్లు పెంచుకోవ‌డానికి అనుమ‌తులివ్వ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో ఏం జ‌రిగింద‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. భ‌విష్య‌త్తులో రాబోయే సినిమాల విష‌యంలో ఏం చేస్తార‌న్న‌ది ఇప్పుడు అస‌లు ప్ర‌శ్న‌. మున్ముందు టాలీవుడ్ పెద్ద హీరోలంద‌రి సినిమాలూ వ‌స్తాయి. మ‌రి ఆ హీరోలంద‌రినీ ప్ర‌భుత్వం ప్ర‌స్తుత వైఖ‌రికి క‌ట్టుబ‌డి ప‌వ‌న్‌ను ఇబ్బంది పెట్టిన‌ట్లే పెట్ట‌గ‌ల‌దా అన్న‌ది సందేహం అలా చేస్తే.. హీరోలు, వారి అభిమానుల దృష్టిలో చెడు కావాల్సి ఉంటుంది. ఈ వైఖ‌రిని మున్ముందు కొన‌సాగించ‌డం అంత తేలిక కాదు. భవిష్య‌త్తులో నిర్ణ‌యం మార్చుకుంటే ఇప్పుడు వ‌కీల్ సాబ్ ప‌ట్ల ఉద్దేశ‌పూర్వ‌కంగా క‌క్ష సాధించిన‌ట్లు అవుతుంది.

ఇప్పుడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రేట్లు ప‌దేళ్ల ముందువ‌ని అంటున్నారు. ఈ ప‌దేళ్ల‌లో ధ‌ర‌లు ఎలా పెరిగాయో తెలిసిందే. ప‌దేళ్ల ముందు సంగ‌తి ఎందుకు.. గ‌త ఏడాది కాలంలో నిత్యావ‌స‌రాలు స‌హా అన్నింటి ధ‌ర‌లూ ఎలా పెరిగాయో తెలిసిందే. వాటి సంగ‌తి వ‌దిలేసి వ‌కీల్ సాబ్ టికెట్ల మీద ఇంత‌గా ఫోక‌స్ ఎందుకు అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల గురించి ప‌ట్టించుకోకుండా సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై ఇంత రాద్దాంతం ఏంటి.. పైగా ప‌వ‌న్ సినిమా విష‌యంలోనే ఈ ప‌ట్టుద‌లేంటి అని ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు. చూస్తుంటే ఈ టికెట్ల ధ‌ర‌ల వ్య‌వ‌హారం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పెద్ద త‌ల‌నొప్పిగా మారేలా ఉంది.