బాబాయ్ హత్య కేసులోని నిందితుడ్ని జగన్ కలిశారా?

సంచలన ఆరోపణలు.. విమర్శలు సంధించే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో షాకింగ్ అంశాన్ని ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వ్యక్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో భేటీ అయ్యారంటూ సంచలన ఆరోపణ చేశారు. రెండేళ్ల క్రితం మార్చి 15న సీఎం జగన్ బాబాయ్ వివేకాను నిర్దక్షిణ్యంగా గొడ్డలితో నరికి చంపారన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎఫ్ఐఆర్ లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గురువారం ఉదయం 10.46 గంటల సమయానికి తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారన్నారు. అదే విధంగా బుధవారం కూడా తన చిన్ననాటి స్నేహితుడిని కలిసినట్లుగా ఆయన పేర్కొన్నారు. పని ఒత్తిళ్లతో బిజీగా ఉండే సీఎం.. తన కేసుల విచారణకు కోర్టుకు హాజరు కాలేనప్పుడు.. బాబాయ్ హత్యలో నిందితుడైన వ్యక్తితో చర్చలు ఎలా జరుపుతారంటూ ప్రశ్నించారు.

అంతేకాదు.. తనను బెదిరిస్తున్న వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లను ఇప్పటికే కేంద్ర హోం శాఖకు.. ఐబీకి ఇచ్చేసినట్లు చెప్పారు. తాను హైదరాబాద్ లో ఉన్నా.. ఢిల్లీలో ఉన్నా తనను బెదిరిస్తూ చేసే ఫోన్ కాల్స్ వివరాల్ని అధికారులు రికార్డు చేస్తుంటారని.. ఇందుకు పాల్పడిన వారిని సీఎం జగన్మోహన్ రెడ్డి రక్షించే అవకాశమే లేదన్నారు. జగన్ చిన్ననాటి స్నేహితులే ఇలాంటి పనులు చేస్తారన్న అర్థం వచ్చేలా ఉన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు మాటలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.సొంత పార్టీ ఎంపీ చెప్పినట్లుగా.. బాబాయ్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని సీఎం జగన్ తన నివాసంలోనే కలిశారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవారెవరు?