బీజేపీ రికార్డు సృష్టిస్తుందా ?

ఇపుడిదే అంశంపై తిరుపతి లోక్ సభ పరిధిలో రాజకీయ నేతలు+ జనాలు కాస్త వ్యగ్యంగానే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ బీజేపీ సృష్టించే రికార్డు ఉపఎన్నికల్లో గెలవటం కాదు, నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) ను దాటడమే. అవును మీరు చదివింది అక్షరాల నిజమే. మొన్నటి అంటే 2019 తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో 13 మంది పోటీచేశారు. వీరిలో ప్రధానపార్టీల అభ్యర్ధులు+ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు.

వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాదరావుకు అత్యధికంగా 7,17,924 ఓట్లు రాగా తర్వాత స్ధానంలో టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి 4,90,605 ఓట్లుసాధించారు. అంటే బల్లికి వచ్చిన మెజారిటియే సుమారు 2.28 లక్షల ఓట్లు. మరి గెలిచేస్తామని, పొడిచేస్తామని ఇఫుడు నానా రచ్చ చేస్తున్న బీజేపీ పరిస్ధితి ఏమిటి ? ఏమిటంటే 6వ స్ధానంలో నిలిచింది. కమలంపార్టీ తరపున పోటీచేసిన డాక్టర్ బొమ్మి శ్రీహరిరావుకు వచ్చిన ఓట్లు 16వేలు.

మూడోస్ధానంలో నిలిచింది ఎవరో తెలుసా ? నోటా. అవును నన్ ఆఫ్ ద ఎబోవ్ కు పోలైన ఓట్లు 25750. మూడోస్ధానంలో నోటా నిలవటం అప్పట్లో సంచలనమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన చింతామోహన్ కు వచ్చిన ఓట్లు 23,926. బీఎస్పీ అభ్యర్ధి డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు 20,847 ఓట్లతో ఐదోస్ధానంతో సరిపెట్టుకున్నారు. అంటే ఈ అభ్యర్ధికి జనసేన మద్దతిచ్చింది లేండి.

పోయిన ఎన్నికల్లో పోలైన ఓట్లు చూసిన తర్వాత అందరికీ అర్ధమయ్యుంటుంది బీజేపీ స్ధాయి ఏమిటో. నోటా సాధించిన ఓట్లు కూడా సాధించలేని కమలంపార్టీ నేతలు ఇపుడు గెలుపు పై ఎంత గోల చేస్తున్నారో. తాజా రాజకీయ పరిస్దితుల్లో బీజేపీ అభ్యర్ధి నోటాను అధిగమిస్తే చరిత్రను సృష్టించినట్లే అని రాజకీయాపార్టీల్లోను, జనాల్లోను సరదాగా చర్చలు జరుగుతున్నాయి.

నోటిఫికేషన్ విడుదలై, ఇతర పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు మొదలైన తర్వాత కూడా బీజేపీ అభ్యర్ధిని డిసైడ్ చేయలేదు. మొన్నటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 8 డివిజన్లలో పోటీచేసిన బీజేపీకి వచ్చిన ఓట్లు 250. దీంతోనే బీజేపీ సీన్ ఏమిటో అర్ధమైపోతోంది.  అలాంటిది ఏకంగా ఎన్నికల్లో గెలిచేస్తామని చెప్పుకోవటాన్ని జనాలు పెద్ద జోక్ గా తీసుకుంటున్నారు.