మోడీ చేతులెత్తేశారు.. జ‌గ‌న్‌-కేసీఆర్‌లు కొట్టుకోవాల్సిందే!

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. అనేక విష‌యాల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య ఉప్పు-నిప్పుగా ఉన్న ప‌రిస్థితి తెలిసిందే. ప్ర‌ధానంగా నీటి స‌మ‌స్య‌, ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ బ‌కాయిలు, విద్యుత్ ఉద్యోగుల స‌మ‌స్య‌(ఇది కొంత ప‌రిష్కార‌మైనా.. ఇప్ప‌టికీ పూర్తిగా ప‌రిష్కారం కాలేదు), హైద‌రాబాద్‌లోని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు.. ఇలా అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. అయితే.. ఏపీలో రెండు ప్ర‌భుత్వాలు మారినా.. తెలంగాణ‌లో మాత్రం విభ‌జ‌న త‌ర్వాత నుంచి ఒకే ప్ర‌భుత్వం కేసీఆర్ నేతృత్వంలో కొన‌సాగుతోంది.

అయితే.. ఆయా స‌మ‌స్య‌ల‌పై మాత్రం ఇప్ప‌టికీ ప‌రిష్కారం ల‌భించ‌లేదు. ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు కొన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. సానుకూల ఫ‌లితాలు మాత్రం ల‌భించ‌లేదు. పైగా విద్యుత్ బ‌కాయిలు.. ఏపీకి తెలంగాణ నుంచి 5 వేల కోట్ల పైచిలుకు రావాల్సి ఉంద‌ని.. చంద్ర‌బాబు పేర్కొంటే.. కాదు.. మీరే మాకు క‌ట్టాలి! అని అప్ప‌ట్లో తెలంగాణ‌ మంత్రులు ఎదురు దాడి చేశారు. ఇక‌, సాగునీరు, తాగునీరు, కృష్నా, గోదావ‌రి జిలాల వినియోగం, వాటాలు.. ప్రాజెక్టులు వంటి అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంపై సుప్రీం కోర్టులో టీఆర్ఎస్ నేత‌లు వేసిన కేసు ఇప్ప‌టికీ విచార‌ణ ద‌శ‌లోనే ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇరు రాష్ట్రాలు కూడా కొన్ని స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించుకుని ప‌రిష్కారం చేసుకుంటామ‌ని ప్ర‌క‌టించినా.. ఆ దిశ‌గా అడుగులు ప‌డ‌లేదు. దీంతో చాలా విష‌యాలు న్యాయ ప‌రిధిలో ను, మ‌రికొన్ని విష‌యాలు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు చేరాయి. వీటిలో కీల‌క‌మైంది.. నీటి స‌మ‌స్య‌, విద్యుత్ బ‌కాయిలు. అయితే, నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ స‌మ‌స్య‌ల‌పై కేంద్రం దృష్టి పెడుతుంద‌ని.. త‌మ‌కు సానుకూలంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తుంద‌ని ఇరు రాష్ట్రాలు భావించాయి. అయితే.. తాజాగా మాత్రం కేంద్రం చేతులు ఎత్తేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

టీడీపీ ఎంపీ కింజ‌రాపు రామ్మోహన్‍నాయుడు తాజాగా జ‌రిగిన పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న అప‌రిష్కృత స‌మ‌స్య‌లపై కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. అదేస‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదాపైనా ఆయ‌న మ‌రోసారి గ‌ళం వినిపించారు. దీనికి స‌మాధానంగా కేంద్ర మంత్రి నిత్యానంద్‍రాయ్ మాట్లాడుతూ.. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామ‌ని తెలిపారు.

ఇక‌, అత్యంత కీల‌క‌మైన‌ తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయ‌ని ఒప్పుకొన్న ఆయ‌న‌.. పరిష్కారం మాత్రం త‌మ‌ చేతుల్లో లేదని, తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలలని ఉచిత స‌ల‌హా విసిరారు. అంటే.. దీనిని బ‌ట్టి.. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం చోద్యం చూస్తాన‌ని చెప్పిన‌ట్టే అయింది. ఇక‌, మిగిలింది తెలుగు రాష్ట్రాల‌కు సామ‌ర‌స్య పూర్వ‌క ప‌రిష్కారం లేదంటే.. కొట్టుకుచావ‌డ‌మే!!