మెజారిటి కోసం ఒకరు.. పరువు కోసం మరొకరు

పిల్లికి చెలగాటం..ఎలక్కి ప్రాణసంకటం అనే సామెత లాగ తయారైపోయింది తెలుగుదేశంపార్టీ పరిస్ధితి. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఎలాగైనా సరే గెలవాని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు గట్టి వార్నింగే ఇచ్చారు. ఉపఎన్నికలో గెలవటం అన్నది టీడీపీకి ఇపుడు అత్యంత అవసరమని అందరికీ తెలిసిందే. తమ్ముళ్ళకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన మరుసటి రోజే అలాంటి వార్నింగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చారు.

చంద్రబాబు నేతలకు వార్నింగ్ ఇచ్చారంటే అది పార్టీకి లైఫ్ అండ్ డెత్ లాంటి సమస్య లాంటిది. కానీ జగన్ కూడా ఎందుకని వార్నింగ్ ఇచ్చారు. ఎందుకనంటే మెజారిటి కోసమట. తిరుపతి లోక్ సభలో వైసీపీ అభ్యర్ధి తెచ్చుకునే మెజారిటితో యావత్ దేశం వైసీపీ వైపు చూడాలట. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బల్లి దుర్గాప్రసాదరావుకు 2.28 లక్షల ఓట్ల మెజారిటి వచ్చింది.

రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధికి రావాల్సిన మెజారిటి జగన్ లెక్కలో సుమారు 5 లక్షలని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు జరిగిన ఎన్నికల్లోనే వైసీపీకి 2.28 లక్షల మెజారిటి వచ్చింది. అలాంటిది అధికారంలోకి వచ్చిన రెండేళ్ళల్లో ఎన్నో సంక్షేమపథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. మొన్ననే ముగిసిన పంచాయితి, మున్సిపల్ ఎన్నికల్లో స్వీప్ చేసిన నేపధ్యంలో జరుగుతున్న ఉపఎన్నికలో పార్టీకి ఇంకెంత మెజారిటి రావాలి ? అన్నది జగన్ సూటి ప్రశ్న.

నిజానికి ఈ ఉపఎన్నికలో టీడీపీ గెలుస్తుందనే నమ్మకం ఎవరిలోను లేదన్నది వాస్తవం. అయితే మొన్నటి ఎన్నికల్లో తెచ్చుకున్న సుమారు 4.94 లక్షల ఓట్లన్నా తెచ్చుకుంటే అదే గెలిచినంత సంతోషం. మరి ఇప్పటి పరిస్దితుల్లో అది సాధ్యమేనా ? అన్నదే నేతలందరినీ వేధిస్తున్నది. తన ఓట్లను కూడా తాను తెచ్చుకోలేకపోతే టీడీపీ పరిస్ధితి మరీ ఘోరంగా తయారవుతుంది.

జగన్ మాత్రం మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు+నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దాంతో పార్టీకి మొన్న వచ్చిన 7,22,877 ఓట్లకు మించి అంటే 10 లక్షల మార్కును దాటాలని గట్టిగా చెప్పారట. స్వయంగా అధినేతే అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు రిజల్టు కోసం పనిచేయకుండా ఉంటారా ? అందుకే మెజారిటి కోసం ఒకరు..పరువు కోసం మరొకరు అన్నట్లుగా తయారైంది వైసీపీ-టీడీపీ వ్యవహారం.