ఆ ఎనిమిదిమంది ఎవరో ?

అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కుంభకోణంలో నోటీసులు అందుకోబోయే ఎనిమిది ఎవరనే విషయంలో అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. చంద్రబాబునాయుడు హయాంలో అమరావతి భూకుంభకోణం జరిగిందని ప్రభుత్వం మొదటినుండి చెబుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అసైన్డ్ భూముల కుంభకోణానికి బాధ్యునిగా పేర్కొంటు సీఐడీ చంద్రబాబు మీద 120బి, 166, 167, 217 సెక్షన్ల కేసులు నమోదు చేసింది.

ఈనెల 23వ తేదీన విచారణకు హాజరవ్వాలంటూ చంద్రబాబు ఇంటికి వెళ్ళి మరీ సీఐడి ఉన్నతాధికారులు నోటీసులు అందించారు. మరి నోటీసులను చంద్రబాబే స్వయంగా తీసుకున్నారా ? లేకపోతే ఇంకెవరైనా తీసుకున్నారా ? అన్నది తేలలేదు. అయితే నోటీసు ఇచ్చే సమయంలో చంద్రబాబు కుటుంబసభ్యులతో సీఐడీ అధికారులు మాట్లాడినట్లు సమాచారం. చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులో మరో ఎనిమిది పేర్లు కూడా ఉన్నట్లు తెలిసింది.

అప్పటి భూవ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన మాజీమంత్రి పొంగూరు నారాయణకు కూడా సీఐడీ ప్రత్యేకంగా నోటీసు ఇచ్చింది. కాబట్టి చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులో ఉన్న ఎనిమిదిమంది పేర్లలో నారాయణ పేరు లేదని స్పష్టమైపోయింది. మరి చంద్రబాబుకిచ్చిన నోటీసులో ఉన్న 8 పేర్లు ఎవరివి ? అన్నది సస్పెన్సుగా మారిపోయింది. చంద్రబాబుతో పాటు కుటుంబసభ్యుల పేర్లు కూడా ఉన్నాయా అనే విషయంలో అనుమానాలు పెరుగుతున్నాయి.

కుటుంసభ్యుల పేర్లే గనుక ఉంటే ఎవరికి వారికి విడివిడిగా నోటీసులు ఇస్తారు కానీ అందరికీ కలిపి చంద్రబాబుకే నోటీసులు ఇవ్వరని అంటున్నారు. మొత్తానికి నోటీసులో ఉన్న ఆ ఎనిమిదిమంది పేర్లపై జనాల్లో ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. కొద్ది సేపటిలోనే ఆ ఎనిమిదిమంది పేర్లు బయటపడే అవకాశాలున్నాయి. అప్పటి వరకు సస్పెన్సు కంటిన్యు అవ్వకతప్పేట్లు లేదు.