మోడి అసలు లెక్కే చేయటంలేదా ?

రాష్ట్ర ప్రయోజనాలకు నరేంద్రమోడి సర్కార్ ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటోందనే విషయం తేలిపోయింది. రాష్ట్రప్రయోజనాలకన్నా తమ విధానపరమైన నిర్ణయాలను అమలు చేయటమే ప్రధాన అజెండాగా మోడి డిసైడ్ చేసుకున్నట్లున్నారు. తాజాగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటలే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.

వైజాగ్ వైసీపీ ఎంపి ఎంవివి సత్యనారాయణ ఉక్కు ప్రైవేటీకరణపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదని స్పష్టంగా చెప్పేశారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. స్టీల్ ప్లాంట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదన్నారు. ప్లాంట్ అమ్మకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు కూడా కేంద్రమంత్రి సూటిగా చెప్పారు.

ప్రభుత్వానికి ఫ్యాక్టరీలో ఎలాంటి వాటాలు లేకపోయినా అవసరమైనపుడు అవసరమైన మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్లు సీతారామన్ స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలో నూరుశాతం వాటాలను ఉపసంహరించుకోబోతున్నట్లు చెప్పేశారు. కేంద్రమంత్రి సమాధానం ప్రకారం స్టీల్ ప్యాక్టరీ అమ్మకంపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి కాబట్టే చెప్పినట్లుంది. తాజాగా కేంద్రమంత్రి చెప్పిన సమాధానం ప్రకారం ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగదని అర్ధమైపోయింది.

ఈ నేపధ్యంలోనే కేంద్ర నిర్ణయంపై ఎలా స్పందించాలనే విషయాన్ని ఉద్యోగులు, కార్మికులు, ప్రజాసంఘాలే తేల్చుకోవాలి. ఎందుకంటే వివిధ కారణాల వల్ల రాజకీయపార్టీలతో లాభం లేదని తేలిపోయింది. గడచిన నెల రోజులుగా వైజాగ్ లో వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టంచుకోదని తేలిపోయింది. ఇక్కడ స్పష్టమైపోయిందేమంటే రాష్ట్ర ప్రయోజనాలనే కాదు కనీసం బీజేపీ నేతలను కూడా నరేంద్రమోడి పట్టించుకోవటం లేదని తేలిపోయింది.