కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా మెట్రోమ్యాన్

మెట్రోమ్యాన్ అంటే ఎవరికైనా శ్రీధరనే గుర్తుకొస్తారు. మెట్రోమ్యాన్ అంటే దేశంలో మెట్రో రైళ్ళ రూపకల్పనకు, డీటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారీ, మెట్రో లైన్ల డిజైన్ తదితరాల్లో శ్రీధరన్ సిద్ధహస్తుడనటంలో సందేహంలేదు. అలాంటి మెట్రోమ్యాన్ను బీజేపీ కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించింది. గడచిన పదిరోజులుగా శ్రీధరన్, బీజేపీలో చేరుతారనేది ఖాయమైపోయింది.

కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తాను ఉంటానంటు స్వయంగా మెట్రోమ్యానే ప్రకటించారు. ఆయన ప్రకటననే ఈరోజు కేరళ పార్టీ అధ్యక్షుడు సురేంద్రన్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇక్కడ అందరిలోను ఓ అనుమానం పెరిగిపోతోంది. అదేమిటంటే మెట్రో సర్వేసుల రంగంలో శ్రీధరన్ను అందరు మెచ్చుకుంటారు కానీ ఓట్లు వేస్తారా అని. ఎందుకంటే మహా మహా వాళ్ళే ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకోలేక చతికిల పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి.

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రపంచ ఆర్ధికరంగంలోని గొప్ప వాళ్ళలో ఒకరు. కానీ ఆయన ఢిల్లీలోని ఓ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తే జనాలు ఓట్లేయలేదు. మన్మోహనే కాదు అనేక రంగాల్లో ప్రఖ్యాతులైన వాళ్ళు ఎంతోమంది పోటీ చేసి ఓడిపోయారు. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ గా దేశంలో ఎంతో పాపులరైన టీఎన్ శేషన్ అధ్యక్షునిగా పోటీ చేస్తే గెలవలేకపోయారు.

మరి ఈ విషయాలు బీజేపీ అగ్రనేతలకు తెలీక కాదు శ్రీధరన్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే మెట్రోమ్యాన్ కున్న క్లీన్ ఇమేజి కారణంగా బీజేపీకి ఓట్లు పడిపోతాయనే భ్రమలో ఉన్నట్లున్నారు. క్లీన్ ఇమేజి ఉన్నంత మాత్రాన జనాలు ఓట్లేసేయరని ఇప్పటికే అనేక ఎన్నికల్లో నిరూపితమైంది. కాకపోతే కేరళలో గెలుపు అవకాశాలు కాదు కదా నాలుగు సీట్లు తెచ్చుకుంటే అదే మహాగొప్పన్నట్లుగా ఉంది బీజేపీ పరిస్ధితి. అందుకనే ఓ ప్రయోగం చేస్తే నష్టం ఏమీ లేదనే శ్రీధరన్ను ముందుకు తోసినట్లుంది. చూద్దాం కేరళ ఓటర్లు శ్రీధరన్ను ఏ మేరకు ఆదరిస్తారో.