ఆ నలుగురూ బ్లాక్ మెయిలర్లట – ఆర్కే సంచలనం

నలుగు బీజేపీ నేతలపై ఏబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ డైరెక్టుగానే సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్రప్రభుత్వాన్ని చూపించి రాష్ట్రంలో నలుగురు నేతలు అందరినీ బెదిరిస్తు బతకటానికి అలవాటు పడిపోయారట. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధనరెడ్డి, జీవిఎల్ నరసింహారావు అందరినీ బెదిరిస్తు బతికేస్తున్నారట. వీళ్ళకు పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ అండగా నిలబడ్డారట.

మొత్తానికి నలుగురు నేతలపై రాధాకృష్ణ బ్లాక్ మెయిలర్లనే ముద్ర వేసేశారు. పార్టీ ప్రయోజనాలను గాలికొదిలేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే పై నలుగురు నేతలు పనిచేస్తున్నట్లు చెప్పటం సంచలనంగా మారింది. ఈ నలుగురి వల్ల పార్టీ పరిస్దితి రాష్ట్రంలో మరింతగా దిగజారిపోతోందని చాలామంది నేతలు తీవ్ర ఆవేధన వ్యక్తం చేస్తున్నట్లు ఎండి చెప్పుకొచ్చారు.

ఇలాంటి నేపధ్యంలోనే జనసేన అదును కోసం ఎదురు చూస్తోందట. ఎందుకయ్యా అంటే బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకునేందుకట. వాళ్ళపై ఒకవైపు తీవ్రమైన ఆరోపణలు చేస్తునే మరోవైపు తమ స్టూడియోలో ఐదు రోజుల క్రితం విష్ణుపై జరిగిన దాడిని కూడా ప్రస్తావించారు. స్టూడియోలో అమరావతి ఉద్యమంపై చర్చ జరుగుతున్న సమయంలోనే అమరావతి పరిరక్షణ సమితి నేత కొలకపూడి శ్రీనివాసరావు బీజేపీ నేత విష్ణును చెప్పుతో కొట్టారు. దానిపై అప్పట్లో కలకలం రేగింది.

దానికి కొనసాగింపుగా ఏబిఎన్ స్టూడియోలో జరిగే చర్చల్లో బీజేపీ నేతలు ఎవరు పాల్గొనకూదని వీర్రాజు ప్రకటించారు. దీంతో రాదాకృష్ణకు బాగా మండినట్లుంది. ఇద్దరి మధ్య జరిగిన వివాదాన్ని పరిష్కరించేందుకు తాను చేసిన ప్రయత్నాన్ని కూడా వివరించారు. ఏదేమైనా బీజేపీ నిర్ణయంతో ఏబిఎన్ యాజమాన్యానికి బాగా కోపం వచ్చినట్లుంది. అందకనే డైరెక్టుగానే వీర్రాజు అండ్ కో ను రాధాకృష్ణ బ్లాక్ మెయిలర్లంటూ అభివర్ణిస్తు తీవ్రమైన ఆరోపణలే చేశారు. మరి దీని రియాక్షన్ ఎలాగుంటుందో.