యోగా గురు రాందేవ్ టైం బ్యాడ్‌.. అరెస్టుకు రంగం సిద్ధం!

ప్ర‌పంచ ప్ర‌సిద్ధ‌.. యోగా గురు.. రాందేవ్ బాబా టైం బాగోలేదా.. ఆయ‌న‌ను ఏ క్ష‌ణంలో అయినా అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన క‌రోనాను అంతం చేసేందుకు లేదా నివారించేందుకు ప్రపంచంలో త‌ల‌పండిన శాస్త్ర‌వేత్త‌లు సైతం త‌ర్జ‌న భ‌ర్జ‌న పడుతున్నారు. ప్ర‌స్తుతం మ‌న ద‌గ్గ‌ర వ్యాక్సిన్ క‌నుగొన్నా.. దానిపైనా ఇటీవ‌ల ఓ దేశం అనేక సందేహాలు వ్య‌క్తం చేసింది. ఇక‌, మ‌న దేశంలోనూ ప్ర‌భుత్వం.. మీరు వ్యాక్సిన్ తీసుకున్నా.. క‌రోనా పోయిన‌ట్టు కాదు.. మాస్కులు ధ‌రించాలి. భౌతిక దూరం పాటించాలి.. అంటూ ప్ర‌చారం చేస్తోంది.

అంటే.. క‌రోనాకు స‌రైన ఔష‌ధం ఇప్ప‌టికీ మార్కెట్‌లోకిరాలేదు.. అంతేకాదు.. ఎవ‌రూ క‌నిపెట్ట‌లేదు. పైగా అది అనేక రూపాలు సంత‌రించుకుంటోంద‌ని ఇటీవ‌ల శాస్త్ర‌వేత్త‌లు చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో కరోనాను త‌రిమి కొడ‌తానంటూ.. రాం దేవ్ బాబాకు చెందిన ఆయుర్వేద ఔష‌ధ ఉత్ప‌త్తుల‌ వ్యాపార‌ సంస్థ‌ పతంజలి సంస్థ నుంచి ‘కొరొనిల్’‌ మందును తెచ్చారు. దీనిని విడుదల చేసే సమయంలో కొరొనిల్‌కు‌ ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సర్టిఫికెట్‌ ఉందని చెప్పి రామ్‌దేవ్‌ బాబా చెప్పారు. అయితే.. దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము ఎలాంటి స‌ర్టిఫికెట్ ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

దీంతో ఇదే .. ఇప్పుడు రాందేవ్‌ను క‌ట‌క‌టాలు లెక్కించేందుకు ఆస్కారం క‌ల్పించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రజలను మోసం చేయాలని యోగా గురు ప్ర‌య‌త్నించార‌ని.. ఆయ‌న‌ను అరెస్టు చేయాలని పలు ఆరోగ్య సంస్థలు, సామాజిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ సూర్య ప్రతాప్‌ సింగ్‌ సైతం ఆయనను అరెస్టు చేయాలని న్యూఢిల్లీ పోలీసులను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. ప్ర‌స్తుతం ఇది కేంద్ర హోం శాఖ ప‌రిధిలోకి వెళ్లింది. ఈ విష‌యాన్ని కేంద్రం కూడా సీరియ‌స్‌గా తీసుకుంది.

‘డియర్‌ ఢిల్లీ పోలీసు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరణ పేరుతో కోట్ల మంది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన రామ్‌దేవ్‌ బాబాను అరెస్టు చేస్తారా? ఇది అంతర్జాతీయ మోసంగా పరిగణించాలి. దీనికి కఠిన చర్యలు ఉండేలా చూడాలి’ అంటూ ట్విటర్‌ వేదికగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ సూర్య ప్రతాప్‌ సింగ్‌ కోరారు. కాగా ఈ నెల 19వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, మరో మంత్రి నితిన్‌ గడ్కరీ సమక్షంలో రామ్‌దేవ్‌ బాబా కొరొనిల్‌ మందును విడుదల చేశారు. ఫార్మాస్యూటికల్‌ ప్రొడక్ట్‌గా తమ మందుకు సర్టిఫికెట్‌ ఉందని, దీంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మరో సర్టిఫికెట్‌ ఉందని రామ్‌దేవ్‌ బాబా ప్రకటించారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము ఏ సర్టిఫికెట్‌ జారీ చేయలేదని ట్విటర్‌లో స్పష్టం చేసింది. ప్ర‌స్తుతం ఇది దేశంలోనే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నంగా మారింది.